ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. రాబోయే నాలుగైదు నెలల్లో మరో ఐదారు సంస్థలను అమ్మేయనున్నది. ప్రజా ప్రయోజనాల కన్నా కార్పొరేట్లతో అవసరాలే మిన్నా అనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. అందినకాడికి అమ్ముకోవాలని చూస్తున్నది.ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను వదిలించుకున్న కేంద్రం.. ఇప్పుడు సంపన్నమైన ఎల్ఐసీలోనూ క్రమంగా వాటాలను తగ్గించుకొనేందుకు సిద్ధమవుతున్నది.
న్యూఢిల్లీ, నవంబర్ 17: కాదేది కవితకు అనర్హం అన్నారో కవి. లేదేది అమ్మకానికి అనర్హం అంటున్నది మోదీ ప్రభుత్వం. అమ్ముకోడానికి అనువైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)లను ఏరే పనిలో ఉన్న మోదీ టీం.. ఇప్పటికే గుర్తించిన 6 సంస్థలను ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో విక్రయించేస్తామన్న సంకేతాలను ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చిలోగా ఐదారు కేంద్ర ప్రభుత్వ కంపెనీలను అమ్మకానికి పెడుతామని బుధవారం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు. వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సు 2021లో మాట్లాడుతూ.. ఈ సంస్థలను దక్కించుకోవాలన్న ఆసక్తి ఉన్న కార్పొరేట్లు బిడ్లను దాఖలు చేయవచ్చని కూడా పాండే ఆహ్వానించారు.
రాబోయే జనవరి-మార్చి త్రైమాసికంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) వచ్చే వీలుందని తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలిపారు. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కేంద్రం చేరుకోవాలంటే ఎల్ఐసీ వాటాల విక్రయమే కీలకం. ఈ 2021-22లో రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటిదాకా రూ.9,330 కోట్లనే సేకరించింది. మొత్తానికి షేర్ల అమ్మకానికి కరోనా పరిస్థితులతో ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో వచ్చే మార్చిలోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
త్వరలో అమ్మకానికి వస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చమురు రంగానికి చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్),
రక్షణ రంగానికి చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్), షిప్పింగ్ రంగానికి చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ఉన్నాయి. అలాగే హెలికాప్టర్ సర్వీస్ కంపెనీ పవన్ హన్స్ లిమిటెడ్ (పీహెచ్ఎల్), ఇంజినీరింగ్ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్), దేశంలోనే అతిపెద్ద పిగ్ ఐరన్ ఎగుమతిదారు నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్) ఉన్నాయి.
‘19 ఏండ్ల తర్వాత ఈ ఏడాది ఏకంగా ఐదారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు రాబోతున్నాయి. భారత్ పెట్రోలియంతోపాటు బీఈఎంఎల్, ఎస్సీఐ, పీహెచ్ఎల్, సీఈఎల్, ఎన్ఐఎన్ఎల్ సంస్థలను కొనేందుకు ఈ డిసెంబర్-జనవరిలో బిడ్లు దాఖలు కావచ్చు. వచ్చే నెలాఖరుకల్లా ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది’
-తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి