న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఎల్ఐసీ మెగా ఐపీవోలో కోటిమంది వరకూ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేస్తారని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అంచనా వేస్తున్నది. తమ పాలసీదారులతో పాటు ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు చేసే ప్రజల్లో కనీసం ఏడో వంతు ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో (ఐపీవో) ఇన్వెస్ట్ చేస్తారని సంస్థ భావిస్తున్నది. ఆఫర్ బుక్న్న్రింగ్ సంస్థలు, ఇతర మార్కెట్ భాగస్వాముల నుంచి అందిన సమాచారం మేరకు ఈ అంచనాకు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 75 లక్షల నుంచి ఒక కోటి దరఖాస్తుల వరకూ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తాయని, వీటి ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడుల్ని ఇష్యూ ఆకర్షిస్తుందని విశ్వసిస్తున్నారు. ఒక్కో రిటైల్ దరఖాస్తు ద్వారా సగటున రూ.30,000-40,000 పెట్టుబడి వస్తుందని అనుకొంటున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. దేశంలో ప్రస్తుతం 7.38 కోట్ల డీమ్యాట్ ఖాతాదారులు ఉన్నారు.
ఐపీవోలోకి పాలసీహోల్డర్లను ఎల్ఐసీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నందున, డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చి నెలలో ఎల్ఐసీ ఐపీవో రాబోతున్నది. వ్యక్తిగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చురుగ్గా ప్రయత్నాలు మొదలుపెడుతున్నారని, దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి వ్యక్తమవుతున్నదని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గరిష్ఠస్థాయిలో రిటైల్ భాగస్వామ్యం ఉండేలా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో పాటు స్థానిక బ్రోకర్లు, బీమా ఏజెంట్లు కృషి చేస్తున్నారన్నారు. గతేడాది మార్చి నాటికి దేశంలో ఎల్ఐసీకి 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. దేశంలోని మారుమూల జిల్లాల నుంచి కూడా రిటైలర్లు ఎల్ఐసీ ఐపీవో పట్ల ఉత్సాహం కనపరుస్తున్నారని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సువిజిత్ రే తెలిపారు.
మార్చి 28-29న ఉద్యోగుల సమ్మె
ఎల్ఐసీ ఐపీవోను వ్యతిరేకిస్తూ మార్చి 28-29 తేదీల్లో రెండ్రోజులపాటు బీమా సంస్థల ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్రకటించింది. ఎల్ఐసీని ప్రైవేటీకరించేదిశగా తొలుత ప్రభుత్వం పబ్లిక్ ఆఫర్ను జారీచేస్తున్నట్టు ఏఐఐఈఏ ఆరోపిస్తున్నది. ఏఐఐఈఏ ప్రకటించిన సమ్మెకు ఎల్ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ మద్దతును ప్రకటించింది. ఐపీవో ప్రారంభపు తేదీనాడు తాము బాయ్కాట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఏఐఐఈఏ ఉపాధ్యక్షుడు ఏకే భట్నాగర్ చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు కూడా పాల్గొంటున్నాయన్నారు. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో సగటు బీమా ప్రీమియం పరిమాణం రూ. 50,000కాగా, ఎల్ఐసీది రూ.11,000గానే ఉన్నదని, ఐపీవో తర్వాత ఇతర ప్రైవేట్ కంపెనీల్లానే ఎల్ఐసీ సైతం సంపన్నులవైపే దృష్టిపెడుతుందని, పాలసీల సంఖ్యను పెంచేబదులు బీమా ప్రీమియంలను అధికంచేస్తుందని భట్నాగర్ హెచ్చరించారు. పేదలకు సామాజిక బీమా పథకాలు కనుమరుగవుతాయన్నారు.