జనగామ : రాష్ట్రంలో మొదటి టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనగామలో జరుగనుంది. కావున ఆరంభ వేడుకలు అదిరిపోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ నెల11న జనగామకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్లో నియోజవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండలాల వారీగా కార్యకర్తలు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సభ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అత్యంత సంతోషపడే విధంగా, ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా జనగామ బహిరంగ సభ సక్సెస్ అయ్యేలా పని చేయాలన్నారు. బీజేపీ నేతలు ఏవేవో కూతలు కుస్తున్నరు.
వాళ్ల వెకిలి, మకిలి మాటలు తిప్పికొట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తయారు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు పులుల్లా ఉండాలి. ఏ ఒక్క హామీని నెరవేర్చని బీజేపీ అబద్ధపు ప్రచారాలను దీటుగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.
గ్రామాలకు గ్రామాలుగా తరలి వచ్చి జనగామ సభను సక్సెస్ చేద్దామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సాంబారు సమ్మరావు, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.