రామాయంపేట, డిసెంబర్ 27: కాట్రియాల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గిరిజన తండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన లంబాడి దేవుజ పశువుల కొట్టం నుంచి 8 మేకలను చిరుత చంపి తిన్నట్లు బాధితుడు తెలిపాడు.
ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపడంతో, బీట్ అధికారి సాయికృష్ణ ఆధ్వర్యంలో వాచర్లు, ఇతర సిబ్బంది అడవిలో గాలించారు. ఎక్కడా చిరుత ఆనవాళ్లు కనిపించడం లేదని, మేకలను చంపింది తండాలోని ఊరకుక్కలని నిర్ధారించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసినట్లు తెలిపారు. తండావాసులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అధికారులు తెలిపారు.