హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. డబ్బు, కులానికే ప్రాధాన్యమిస్తూ.. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు చురకలంటిస్తూ.. బీజేపీ నేత ఒకరు ట్విట్టర్లో పోస్టు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పైగా రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలిని ఆ పోస్టులో బట్టబయలు చేసినట్టుగా కార్యకర్తలు చెప్పుకొంటున్నారు. రెండు రోజుల క్రితం బ్రిటన్ ప్రధానిగా భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నిక కావడంపట్ల సీనియర్ బీజేపీ నేత పేరాల శేఖర్రావు స్పందించారు. వ్యక్తిత్వానికి కూడా విలువుందని.. కేవలం కులం, డబ్బుకే కాదు.. అంటూ నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడమే కాకుండా.. తెలంగాణ బీజేపీ నేతలు, ఇతర పెద్దలు దీనిని అర్థం చేసుకోవాలని కుండబద్దలు కొట్టడం గమనార్హం. కేవలం వ్యక్తి ప్రతిభా పాటవాలు, నీతి నిజాయతీ, సామర్థ్యాన్ని బట్టి బ్రిటిష్ ప్రధానిగా రిషి సునాక్ను ఎన్నుకున్నారని మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్లో సౌత్జోన్ సభ్యుడైన పేరాల శేఖర్రావు ఘాటుగా స్పందించారు. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, గతంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్కు వైస్చైర్పర్సన్గానూ పేరాల శేఖర్రావు పనిచేశారు. మునుగోడు ఎన్నికతోపాటు.. రాష్ట్ర బీజేపీలో కులం, డబ్బుకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యం, విలువ ఇస్తూ.. అనేక మంది సీనియర్ నాయకులను పక్కనపెడుతున్నారనే అభిప్రాయం సొంత కార్యకర్తల నుంచే వినపడుతున్నంది. తాజాగా పలువురు నేతలుకూడా బీజేపీ నుంచి బయటకు వచ్చి.. అక్కడ సరైన విధానమంటూ లేదని, డబ్బుకు, కులానికి మాత్రమే విలువ ఉన్నదని వాపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్నేత అయిన పేరాల శేఖర్రావు చేసిన ట్వీట్తో.. అది నిజమేనని.. బ్రిటిష్ ప్రధానిగా కులం, డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. వ్యక్తిత్వానికికూడా విలువుందనేలా రిషి సునాక్ను ఎన్నుకున్నారని.. ఇలాంటి మంచి అంశాలను రాష్ట్ర బీజేపీ నేతలు, పెద్దలు గమనించాలని చురకలు అంటించడం పార్టీలో చర్చకు దారితీసింది.