అశ్రువులను పలికించిన, ఆనందభాష్పాలను చిలికించిన సకల రసప్రవాహ మాధురి ఆగిపోయింది. ఇక ఎవరు జోలపాడతారు అలసిన భారతావనికి. ఎవరు మేల్కొలుపుతారు నిద్రాణ చైతన్యాన్ని. ఎవరు మానవీకరిస్తారు దయారసామృతాస్వాద హీనులను, దీనులను. తరాలను అలరించిన స్వరాలు స్వర్గద్వారపు తోరణాలయ్యాయి. భూమిని చుట్టిన గానలత వ్యోమంలోకి ఎగిసిపోయింది.
లతాజీ మీరు వెళ్లిపోయారని ఈ దేశపు జియా బేకరార్ హై. మేరా సాయా సాథ్ హోగా అన్నది… హమ్తో చలే పరదేశ్ అనేందుకేనా? ఎవరికో మీరు వాదా చేశారు. జో వాదా కియా హై వో నిభానా పడేగా.. అంతేనా.. భక్తి, రక్తి, అనురక్తి.. రసమేదైనా, రాగమేదైనా మాకు మీరే నిఖార్సైన స్వర నిఘంటువు. మీ పాటలు మా అంతర్లోకాల్లో కడలి అలల్లా నిరంతరంగా కదుల్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ పాట మీదకు వచ్చి పడుతుందో మాకే తెలియదు. బస్. మమ్మల్ని రంజింపజేయాలని ఆప్కీ నజరోనే సమ్ఝా. కన్నీటి సుడులలో మునిగితేలుతూ లౌట్ కే ఆ అని పిలవాలనుంది. ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నాహై అని రోజూ మీపాటలనే రెక్కలుగా కట్టుకునే మాబోటివాళ్లకు అల్విదా చెప్పేస్తారా? నిదుర పోరా తమ్ముడా అంటూ తెలుగు వాళ్లను పలకరించి మీ గానామృతంలో ముంచి మీరే శాశ్వత నిద్రలోకి జారిపోవడం తగునా?
ముంబై, ఫిబ్రవరి 6: ఎనిమిది దశాబ్దాలు తన స్వర మాధుర్యంతో ప్రపంచాన్ని ఓలలాడించిన గాన కోకిల గొంతు మూగబోయింది. సంగీత ప్రపంచాన్ని తన సుస్వర తరంగాలతో ఏలిన మహారాణి మనల్ని విడిచి వెళ్లిపోయింది. స్వరాల జీవ నది ఇంకిపోయింది. ఓ స్వర యుగం, సంగీతంలో స్వర్ణ యుగం ముగిసిపోయింది. విశ్వ విఖ్యాత గాయని లతా మంగేష్కర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో ఆదివారం ఉదయం 8.12 గంటలకు తుది శ్వాస విడిచారు. శరీరంలో పలు అవయవాలు పనిచేయకపోవడంతో లత మరణించినట్టు వైద్యుడు ప్రతీత్ సందాని చెప్పారు. లతా మంగేష్కర్ వయస్సు 92 ఏండ్లు. కరోనా స్వల్ప లక్షణాలతో జనవరిలో దవాఖానలో చేరారు. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
న్యూమోనియా కూడా వచ్చింది. అప్పటి నుంచి ఆమె దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ శనివారం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం ఉదయం ఆమె మరణించారు. లతా మంగేష్కర్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన రాయబారులు సంతాపం ప్రకటించారు. లతా మంగేష్కర్ మహారాష్ట్రలోని ఇండోర్లో జన్మించారు. ఆమెకు నలుగురు తోబుట్టువులు. హృదయనాథ్ మంగేష్కర్ సోదరుడు. మీనా, ఆశా, ఉషా సోదరీమణులు. లత ఐదేండ్ల వయస్సులోనే పాటలు పాడటంలో శిక్షణ తీసుకొన్నారు. 13 ఏండ్ల వయస్సు నుంచే సినిమాల్లో పాడటం ప్రారంభించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా గీతాలను ఆలపించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా సాహేబ్ ఫాల్కే, భారతరత్న ఇంకా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకొన్నారు.
సోదరుడి చేత అంతిమ సంస్కారాలు
లత అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో అధికార లాంఛనాలతో నిర్వహించారు. సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ చితికి నిప్పంటించారు. అంతకుముందు పెద్దార్ రోడ్డులోని ఆమె నివాసం నుంచి 10 కిలోమీటర్లు అంతిమ యాత్ర సాగింది. వేలాదిమంది అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆమె అంతిమ యాత్ర సాగింది. అంత్యక్రియల్లో ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజులు సంతాప దినాలు
లతా మంగేష్కర్కు నివాళిగా కేంద్రప్రభుత్వం రెండు రోజులు (ఆది, సోమవారాలు) సంతాప దినాలుగా ప్రకటించింది. మహారాష్ట్రలో సోమవారం సెలవు ప్రకటించారు. లతకు నివాళిగా బహింగ ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలు, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర 15 రోజుల పాటు లతాజీ పాటలను ప్రసారం చేయాలని బెంగాల్ సీఎం మమత ఆదేశించారు. లతా మంగేష్కర్ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు సంతాపం ప్రకటించారు.