గాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక.. తొలి టెస్టులో వెస్టిండీస్పై 187 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 52/6తో గురువారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ చివరకు 160 పరుగులకు ఆలౌటైంది. బూనెర్ (68 నాటౌట్), జాషువ డిసిల్వా (54) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా 5, రమేశ్ మెండిస్ 4 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 147, రెండో ఇన్నింగ్స్లో 83 పరుగులు చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నెకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు సోమవారం నుంచి ఇక్కడే ప్రారంభంకానుంది.