రసవత్తరంగా సాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో మరో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడింది. నాలుగో దశలో భాగంగా 59 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రమంత్రి తనయుడి వాహన చట్రాల కింద చిద్రమైన రైతుల హత్యాకాండకు సజీవసాక్ష్యంగా నిలిచిన లఖింపూర్ ఖీరీ, లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే దోషిగా తేలిన ‘ఉన్నావ్’ ప్రాంతాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగనున్నది.
యూపీ నాలుగో దఫాలో 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిలిబిత్, లఖింపూర్ ఖీరీ, సీతాపూర్, హర్దోయి, ఉన్నావ్, లక్నో, రాయ్బరేలీ, బండా, ఫతేపూర్ తొమ్మిది జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఈ 59 సీట్లలో బీజేపీకి 51, ఎస్పీకి 4, కాంగ్రెస్కి 2, బీఎస్పీకి 2, అప్నాదల్(ఎస్)కు ఒక్క సీటు వచ్చింది. ఈ ఎన్నికల్లో 59 స్థానాలకు గానూ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) 57 సీట్లలో పోటీ చేయనున్నది. మిగిలిన రెండు స్థానాల్లో మిత్రపక్షం ఎస్బీఎస్పీ పోటీచేస్తున్నది. బీజేపీ 56 సీట్లలో, దాని మిత్రపక్షం అప్నాదల్(ఎస్) మూడు సీట్లలో బరిలోకి దిగనున్నది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీలోకి దిగాయి.
అప్పటి హవా ఇప్పుడు ఉండేనా?
2017 ఎన్నికల్లో తొమ్మిది జిల్లాల్లో బీజేపీ హవా కొనసాగిందనే చెప్పాలి. ఫిలిబిత్ (4), లఖింపూర్ ఖీరీ (8), బండా (6), ఫతేపూర్ (6) జిల్లాల్లోని అన్ని సీట్లను కమళదళం కైవసం చేసుకొన్నది. ఈ స్థానాల్లో ఏ పార్టీ కూడా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. హర్దోయిలోని 8 సీట్లలో ఏడింటిని, సీతాపూర్లోని 9 సీట్లలో ఏడింటిని, లక్నోలోని 9 సీట్లలో ఎనిమిదింటిని, రాయ్బరేలీలోని ఆరు సీట్లలో మూడింటిని, ఉన్నావ్లోని ఆరు సీట్లలో రెండింటిని బీజేపీ గెలుచుకొన్నది. అయితే, గత ఐదేండ్లలో జరిగిన పరిణామాలు ఫలితాలను పెద్దఎత్తున ప్రభావితం చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ విజయావకాశాలపై దెబ్బ పడనున్నట్టు అంచనా వేస్తున్నారు.
దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి
సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపడుతున్న రైతులను గతేడాది అక్టోబర్ 3న కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా వాహనాలతో తొక్కించిన ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సర్వత్రా ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ప్రధాన నిందితుడు ఆశిష్ను అరెస్టు చేశారు. అయితే ఇటీవల ఆయన బెయిల్పై విడుదలవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపించబోతుందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు.
లఖింపూర్ జిల్లాలోని మొత్తం 8 సీట్లను గత ఎన్నికల్లో కైవసం చేసుకొన్న బీజేపీ.. ఈసారి ఆ స్థాయి ఫలితాలను రిపీట్ చేయబోదని అభిప్రాయపడుతున్నారు. రైతుల నిరసన జ్వాలలు పొరుగు జిల్లాలైన ఫిలిబిత్, హర్దోయి, సీతాపూర్కు కూడా పాకాయి. ఇక్కడ రైతుల జనాభా ఎక్కువ. ఈ ప్రభావం కూడా బీజేపీపై తీవ్రంగా పడొచ్చని అంటున్నారు. దీంతోపాటు 2017లో జరిగిన ఉన్నావ్ లైంగికదాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన దోషిగా తేలడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకొన్నది. ఇదేసమయంలో బీజేపీ వైఫల్యాలు, నేతల అఘాయిత్యాలను ఎస్పీ నేత అఖిలేశ్ ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడంలో సఫలమయ్యారు. 59 స్థానాల్లో 16 సీట్లను ఎస్సీ రిజర్వ్డ్ క్యాటగిరీలో ఉంచారు. ఈ సీట్లను చేజిక్కించుకోవడానికి బీఎస్పీ వ్యూహాలు రచిస్తున్నది. కంచుకోటగా పిలిచే రాయ్బరేలీలో పాగా వేయాలని కాంగ్రెస్ శ్రమిస్తున్నది.