హైదరాబాద్ : రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ( Constable posts ) ఉద్యోగార్థుల తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే యువత ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి గ్రామీణ వర్గాలేనని తెలిపారు.రేయింబవళ్లు కష్టపడి పోటీలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లవద్దని సూచించారు.నీళ్లు, నిధులు, నియామకాలు అన్నదే తెలంగాణ ఉద్యమ నినాదమని పేర్కొన్నారు.
నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆరోపించారు.17 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పినా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయడం లేదని,వేలాది పోలీస్ ఉద్యోగాలు వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీ ఇవ్వకున్నా 47 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామని,2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫై చేసి 1,60,000 కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు.
ఎన్నికల ముందు యువతకు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేస్తున్నదని విమర్శించారు.అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా ఉద్యోగాలు వేయడం లేదని,సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అని చెప్పి దారుణంగా మోసానికి పాల్పడిందని వివరించారు.కేవలం 17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు.రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని,వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.