హైదరాబాద్ : ముంచుకొస్తున్న ఎలినినో ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు చీమకుట్టినట్లయినే లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ (Boinapally Vinod Kumar) ఆరోపించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించకపోతే రాష్ట్ర ప్రజలకు తీవ్ర గడ్డు పరిస్థితులే ఎదుర్కొనవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రిజర్వాయర్లను నీటితో నింపుకోవడం, పొదుపుగా నీటి వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
సీడబ్లూసీ నివేదికల ప్రకారం మేడిగడ్డ ( Medigadda ) నుంచి సముద్రంలోకి ప్రతిరోజు టీఎంసీ నీరు సముద్రంలో కలసి పోతుందని వెల్లడించారు. గడిచిన నెలరోజుల్లో పది టీఎంసీల నీరు సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా సముద్రంలో కలిసిపోయిందని పేర్కొన్నారు. కుంగిన మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టక జాప్యం చేస్తు గోదావరి నీటిని సముద్రంపాలు చేస్తున్నారని విమర్శించారు.
వచ్చే వేసవికాలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదముందని స్వయాన వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.మరమ్మతులు చేపడితే కేసీఆర్కు పేరు వస్తుందన్న కుట్రతో ఆయన మేడిగడ్డను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఏకైక జీవనాధారమని , దానిపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ, శ్రీదర్బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ ముఖ్యమంత్రి వద్ద కాళేశ్వరం మరమ్మతులపై ఎందుకు సీఎంను ప్రశ్నించడం లేదని అన్నారు. ఇప్పటికైన అన్నారం వద్ద ఇసుకతో మేట వేస్తే కన్నెపల్లి పంపుహౌస్ వరకు నీళ్లను మళ్లించవచ్చని అన్నారు. మోటార్లు ఆన్ చేస్తే కేసీఆర్ ( KCR ) పేరు వస్తుందన్న కుట్రతో రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే మూడు నెలల్లో మేడిగడ్డ పూర్తయి నీటితో నిండి తెలంగాణ కళకళలాడేదని వివరించారు. తుమ్మడిహెట్టికి రెండు నెలల్లో కేంద్రం నుంచి అనుమతులు తీసుకొస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చి సంవత్సరమైనా ఎందుకు అనుమతి తీసుకురాలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ పై భాగంలో కురుస్తున్న వర్షాల వల్ల పెద్ద ఎత్తున నీటి ప్రవాహం మేడిగడ్డకు వస్తుందని , రేపటి నుంచి ప్రతి రోజు 5 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయే అవకాశముందని తెలిపారు.