హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఆస్ట్రేలియా-కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్ను కౌలాలంపూర్లో కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు మలేషియా వెళ్లిన కేటీఆర్ను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు. ఇండియన్ కమ్యూనిటీలో ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు 2023లో నిర్వహించిన క్రికెట్ టోర్నీకి ఎంతో ఆదరణ లభించిందని ఆస్ట్రేలియా బీఆర్ఎస్ నేత ఉప్పుల సాయిరాం తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా నిర్వహించాలని సంకల్పించామని పేర్కొన్నారు.
కాగా పార్టీ రజతోత్సవ, రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, పార్టీ రాష్ట్ర నేతలు బడుగుల లింగయ్య యాదవ్, నంద్యాల దయాకర్రెడ్డి, బాలమల్లు, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ రాపోలు, మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు.