హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీతో కలిసి రేవంత్రెడ్డి భారీ కుట్ర పన్నతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే దాడి జరగడం లేదన్న కేటీఆర్.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను గంపగుత్తగా ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పెద్ద ప్లానే వేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన రేవంత్రెడ్డి, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇకడి రైతుల నోట్లో మట్టి కొట్టారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మండల, జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమేనని కేటీఆర్ పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్.. 48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తుంటే రేవంత్ మాత్రం మోదీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాహుల్గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ, రేవంత్కు మాత్రం ముద్దొస్తున్నదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కోరగానే అప్పజెప్పడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి సాక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, బంగారు తెలంగాణ నిర్మాతగా చరిత్ర సృష్టించిన కేసీఆర్ మీద విష ప్రచారం చేయాలన్న దుర్మార్గ, రాక్షస ఆలోచనతో రేవంత్ ఉన్నారని ఫైరయ్యారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను గంపగుత్తగా ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెరతీసిండ్రు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పెద్ద ప్లానే వేస్తున్నరు.
గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలినప్పుడు, సుంకిశాలలో సైడ్వాల్ కూలితే, వట్టెం పంప్హౌస్ కూలినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పుడు రాని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి తలాతోకాలేని రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు. రేవంత్రెడ్డి మీద ఈగ వాలకుండా ప్రధాని మోదీ కాపాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. 14 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో, పదేండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో, రెండేండ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్ను, బీఆర్ఎస్ను అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని స్పష్టంచేశారు. సీబీఐకే కాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పినా బీఆర్ఎస్ భయపడబోదని, బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదురొంటామని స్పష్టంచేశారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ నమ్మకం ఉన్నదని, అకడ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బెదిరింపులు, కేసులు తమకు కొత్త కాదని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేని తేల్చిచెప్పారు.
సీబీఐకే కాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పజెప్పినా బీఆర్ఎస్ భయపడబోదు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదురొంట. న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. అకడ పోరాటం కొనసాగిస్తం.
-కేటీఆర్