KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్ నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
“కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే ‘నన్ను ఓడించి చంపేస్తే.. నేను మిమ్మల్ని గెలిచి చంపేస్తా’ అని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు. సర్పంచులు ఎవరూ ఇలాంటి బెదిరింపులకు లొంగవద్దు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి వాళ్ల అబ్బ సొత్తు కాదు.. వాళ్ల అత్త సొత్తు కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుంది. ఎవడైనా అడ్డుతగిలితే తాట తీసి లైన్ లో పెట్టండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు దిక్కులేక ప్రపంచబ్యాంకుకు ఉత్తరాలు రాస్తున్నారని, అలాంటి సర్పంచ్ లకు ఏం ఇస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయితీలకు ఇవ్వని కాంగ్రెస్, ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ ఇండ్లు భూములు అమ్మి నిధులివ్వడం లేదని, ప్రజల సొమ్ములకు ధర్మకర్తలు మాత్రమే అని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి భిక్ష కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఐదు అంచెల పాలనలో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి ఉందని గుర్తు చేశారు. “కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపింది. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలి. ఆ నిధులను ఆపే హక్కు ఏ ముఖ్యమంత్రికి గానీ, ఎమ్మెల్యేకు గానీ లేదు. మీ హక్కుల కోసం కొట్లాడండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు. ఇందుకోసం జిల్లాకొక ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటుతోపాటు, స్ధానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణా శిభిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అనాథలయ్యాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠ ధామం వచ్చాయి. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. కానీ నేడు పరిస్థితి దారుణం. ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దిక్కు లేదు. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి బాధలు పడుతున్నారని, ఆ చెప్పుల లైన్లు కనపడితే ప్రభుత్వం పరువు పోతుందని ముఖ్యమంత్రి తెలివిగా ‘యూరియా యాప్’ అనే కొత్త స్కీమ్ తెచ్చారు. షాపులో దొరకని యూరియా యాప్లో దొరుకుతుందా?” అని ఎద్దేవా చేశారు.
సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. “ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్ నగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగురడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసి, జడ్పీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇంచార్జీ జాన్సన్ నాయక్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.