KTR | మేడ్చల్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్కు బీజేపీని ఓడించే దమ్ములేదని, ఆ పార్టీకి ఓటేసి ఓటును వృథా చేసుకోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ 2014, 2019లో బీజేపీని అడ్డకున్నది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారాన్ని మైనార్టీలు నమ్మవద్దని, అదే నిజమైతే కవిత జైలులో ఉండేవారా? అని ప్రశ్నించా రు. బీజేపీని ఓడించే దమ్ము లేకపోవడం వల్లే రాహుల్గాంధీ కేరళ నుంచి పోటీచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్కు మళ్లీ ఓటు వేస్తే మొత్తం పథకాలు బంద్ అవుతాయని అనుమానం వ్యక్తంచేశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్లీ కేసీఆర్ చుట్టూ రాజకీయాలు తిరిగే పరిస్థితి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క కేసీఆర్కే ఉందని, ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 200 సీట్లు, ఇండియా కూటమికి 150 సీట్లు దాటవని జోస్యం చెప్పారు. 400 సీట్లలో గెలుస్తామంటూ మోదీది బిల్డప్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. గెలవరని అర్థమైంది కాబట్టే ముస్లింపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉప్పు, పప్పు, చింతపండు, బస్సు, రైలు టికెట్ ధరలు పెంచారని, అందుకనే మోదీని అందరూ ‘ప్రియమైన’మోదీ అంటారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ లేక రాష్ట్రం ఆగమైందని ప్రజలు చర్చించుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ను పది స్థానాల్లో గెలిపిస్తే కేసీఆర్ మళ్లీ తెలంగాణ గొంతుక అవుతారని తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద్, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సురభి వాణీదేవి, మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.