ఆల్మట్టి, నారాయణపురలో గేట్ల ఎత్తివేత.. నేడు జూరాలకు
హైదరాబాద్/నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 12: కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలోనూ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు నిండిపోయాయి. ఆల్మట్టికి 1.13 లక్షల క్కూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండంతో అక్కడి అధికారులు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపుర నుంచి సైతం లక్ష క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లాలోని జూరాలకు ఈ నీరు చేరుకొనే అవకాశం ఉన్నది.
ఇప్పటికే జూరాల జలకళను సంతరించుకోవటంతో ఆరు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 44.34 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ నుంచి 29,190 క్యూసెక్కుల వరద వస్తున్నది. తుంగభద్ర డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో 30 గేట్లను ఎత్తి 45,018 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి 2,831.47 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. మంగళవారం మూడు గేట్లను మూసివేసి, రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.