హుజూరాబాద్ : బీజేపీ పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విరుచుకు పడ్డారు మంగళవారం జమ్మికుంటలోని 1,2,3,5 వ వార్డుల్లో కాలినడకన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల బీజేపీని తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనుకు అపూర్వ విజయం చేకూర్చడం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రజలను కోరారు. వంట గ్యాస్ ధర ఇప్పుడు రూ.1,000 రూపాయలు ఉంది. ఇక్కడ పోలింగ్ ముగిసిన తెల్లారే మరో రూ .200 పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తుంటే, ఒక్కొక్కటిగా అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుంటే బిజెపి నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు కేంద్ర ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనేందో, అభివృద్ధి ఏందో మాత్రం చెప్పరు గానీ..కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నరని కొప్పుల అన్నారు. రామన్నపల్లికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కూరెళ్ల రాము,హనీఫ్,తిరుపతి తదితరులు మంత్రి కొప్పుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
రామన్నపల్లిలో ఇటీవల మృతి చెందిన మర్రి మల్లయ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు రవీందర్,భిక్షపతి, వీరన్న, టిఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, సత్యనారాయణ రావు,వద్దిరాజు రవిచంద్ర, రామస్వామి,రజిత్, రమేష్,నరేష్, రాకేష్ తదితరులు ఉన్నారు.