గద్వాల టౌన్, డిసెంబర్ 24 : అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడిగా.. కొలిచిన వారి కొంగు బంగారంగా గ ద్వాలలోని భీంనగర్లో కొలువైన సంతాన వేణుగోపాలస్వామి నిత్యపూజలు అందుకుంటున్నాడు. వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే హయగ్రీవస్వామి స్వయంభూగా వెలిశారు. దీంతో ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకున్నది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలను సంస్థాన కాలం నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను గ ద్వాల చిన్నజాతర అని కూడా అంటారు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా మూడు రో జులపాటు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చే శారు. స్వామి విగ్రహాన్ని నలసోమనాద్రి ప్రతిష్ఠించ గా.. ఆలయాన్ని సంస్థానంలో ఆరో తరానికి చెందిన రాజా సీతారాంభూపాల్ తల్లిదండ్రులు భీంరెడ్డి, లక్ష్మీనాంచారమ్మ నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. ప్రస్తుతం రాజవంశస్తులైన వెంకటసదాశివారెడ్డి భా ర్య సంయుక్తమ్మ, వెంకటాపురం ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పూజా కార్యక్రమాలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వేణుగోపాలస్వామిని 41 రోజులు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలంలోనే హయగ్రీవస్వామి స్వయంభూగా ఉద్భవించారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఇరువురు స్వాములు కొలువైన ఆలయంగా విరాజిల్లుతున్నది. గద్వాల చిన్నజాతర సందర్భంగా పెద్ద ఎత్తున అంగళ్లు, రంగుల రాట్నాలు, సర్కస్లు వెలిశాయి. దాదాపు నెలపాటు జాతర కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి పుణ్యాహవాచనం, అంకురార్పణతో పూజలు మొదలవుతాయి. 11 గంటలకు ధ్వజారోహణం, భేరీపూజ, హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు కల్యాణోత్సవం ఉంటుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు నిత్యహోమం, రాత్రి 8 గంటలకు రథోత్సవం, పల్లకీసేవ, ఊరేగింపు, సోమవారం ఉదయం 10 గంటలకు పారువేట, 3 గంటలకు తీర్థావళి, నాగవెల్లి, పూర్ణాహుతి, దేవతా విసర్జనలు ఉంటాయని అర్చకులు పవన్కుమార్, రాఘవాచారి తెలిపారు.