Iran-US-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్ర రూపందాల్చింది. గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా సైనిక స్థావరాలపై, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తుంటే.. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక తీరంలోని ఐరిస్ డేనా అనే ఇరాన్ యుద్ధ నౌకపై బుధవారం అమెరికన్ సబ్మెరైన్ దాడి చేసింది. ఈ దాడిలో నౌకలోని 101 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం.
అలాగే 78 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో నౌకలో 180 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రీలంక నేవీ, రక్షణ శాఖ ధృవీకరించాయి. ఈ దాడి నేపథ్యంలో బాధితుల్ని రక్షించేందుకు శ్రీలంక నావికాదళం సహాయక చర్యలు ప్రారంభించింది. దాడికి గురైన నౌక నుంచి అందిన ఎమర్జెన్సీ కాల్తో శ్రీలంక నేవీ రంగంలోకి దిగింది. శ్రీలంక దక్షిణ తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో, గాలె ప్రాంతంలో ఉదయం 5.00 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు శ్రీలంక నేవీ 32 మందిని రక్షించినట్లు ప్రాథమిక సమాచారం. బాధితుల్ని తీర ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. శ్రీలంక విదేశాంగ మంత్రి హెరాత్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో తీర ప్రాంతంలో భద్రతను మరింత పెంచినట్లు హెరాత్ తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు ఇరాన్- ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధాన్ని ఆపాలని శ్రీలంక కోరింది.