ఎవరి ‘చేతిలో’…?
Congress | అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ విధంగా, తర్వాత మరో విధంగా అన్నట్లుగా మారింది హస్తం పార్టీలో పరిస్థితి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులే లేక తీవ్రంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వ ఇబ్బంది వెంటాడుతున్నది. ఇందులో ఆధిపత్య ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పదవుల పంపకాల కోసం, కీలకమైన స్థానాల్లో చోటు కోసం నాయకత్వం పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది.
ఎవరికి వారు అధిష్టానం దృష్టిలో పడేందుకు తహతహలాడుతుండగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై పెత్తనం కోసం కూడా పరుగులు తీస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అర్బన్ నుంచి అనూహ్యంగా షబ్బీర్ అలీ పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ప్రభుత్వం రావడంతో సలహాదారు హోదాలో నియోజకవర్గానికి వచ్చిపోతున్నారు. ఎన్నికల సమయంలో కేటాయించినంత సమయాన్ని ఇప్పుడు శ్రేణులకు ఇవ్వలేకపోవడంతో హస్తం శ్రేణులు ఆగమాగమవుతున్నాయి.
పీసీసీ ఆదేశాలతో ఏదైనా కార్యక్రమాలు తలపెడితే ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించాలి..ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలి అన్న చర్చ ఇప్పుడు హస్తం నాయకత్వాన్ని పట్టి పీడిస్తున్నది. షబ్బీర్ స్థానాన్ని పూరించేందుకు పలువురు నేతలు నువ్వా నేనా అన్నట్లుగా నిలుస్తున్నప్పటికీ ఎమ్మెల్సీగా మహేశ్ కుమార్ గౌడ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తలకు మహేశ్ కుమార్ గౌడ్ రూపంలో అండ దొరుకుతుందా? లేదంటే షబ్బీర్ అలీనే నియోజకవర్గ ఇన్చార్జీగా ఉంటారా? అన్నది కాంగ్రెస్ పార్టీ తేల్చాల్సి ఉంది.
నిజామాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జీలు ఎవరన్నది పెద్ద పజిల్గా మారింది. ఎన్నికలయ్యాక ఓటమి చెందిన చోటనే ఇదంతా చోటు చేసుకుంటుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గానికి ఇన్చార్జి ఎవరన్నది తెలియక కిందిస్థాయి శ్రేణులు తీవ్ర అయోమయానికి గురవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గానికి ఆశాదీపంగా ఎవరు బరిలో ఉన్నారన్నది తెలియకపోవడంతో గందరగోళం చోటు చేసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డజన్ మంది నాయ కత్వం ఆధీనంలో రాజకీయం కొనసాగింది.
పీసీసీ ఆదేశాలతో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసిన షబ్బీర్ అలీ రాకతో అంతా తామే అనుకున్న వారంతా వెనక్కి జరిగిపోయారు. ఓటమి చెందిన తర్వాత షబ్బీర్ అలీ అడపా దడపా వచ్చిపోతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఎన్నికవ్వడంతో ఇన్చార్జీగా ఎవరన్నది ఎటూ తేలడం లేదు. ఆది నుంచి అర్బన్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తూ వచ్చిన మహేశ్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలోనే నియోజకవర్గం కొనసాగుతుం దా? లేదంటే షబ్బీర్ అలీ ఆధీనంలో నాయకత్వం పనిచేస్తుందా? తెలియడం లేదు.
కామారెడ్డి నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీసీసీ చీఫ్ హోదాలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి చెందారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా సమయం లేకపోవడంతో ఇక్కడి బాధ్యతలను తన తమ్ముడు కొండల్ రెడ్డి, కొడంగల్కు చెందిన పలువురు ముఖ్యులకు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికలయ్యాక కామారెడ్డి సీటు కాస్త బీజేపీకి చిక్కడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. షబ్బీర్కు కంచుకోట అనుకున్న కామారెడ్డి నియోజకవర్గం కాకుండా పోయింది. నిజామాబాద్ అర్బన్కు వలస వెళ్లి పోటీచేసి ఆయన ఓటమి చెందారు. దీంతో కామారెడ్డిపై పట్టు సాధించేందుకు షబ్బీర్కు అవకాశం లేకుండా పోయింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారుగా ప్రభుత్వం నియమించినప్పటికీ క్యాబినెట్ ర్యాంకులో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కామారెడ్డి నియోజకవర్గంపై షబ్బీర్కు భవిష్యత్తులో అవకాశం ఉంటుందా? లేదా? అన్నది తేలడం లేదు. పైగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపైనా షబ్బీర్ చూపు కొనసాగుతుండడంతో ఎటూ అర్థం కాని దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా కొండల్ రెడ్డి మాత్రం కామారెడ్డిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించినట్లుగా తెలిసింది. ఇక్కడి రాజకీయాలపై నిశితంగా పరిశీలన చేస్తుండగా కామారెడ్డి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు సమయం కేటాయిస్తూ వారి సాధక బాధకాలను పంచుకుంటుండడం చర్చకు దారితీస్తున్నది.