కోల్కతా: కేంద్రంలో అధికారం అండ చూసుకుని బీజేపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఆ పార్టీ యూత్ లీడర్ వీరంగం సృష్టించాడు. టీఎంసీ కార్యకర్త అంటూ ఓ లాయర్పై విచక్షణారహితంగా దాడిచేశాడు. కోల్కతాలోని ఐసీసీఆర్ ఆడిటోరియంలో బీజేపీ ఓ సమావేశం నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తర కోల్కతాకు చెందిన బీజేపీ యూత్ వింగ్ లీడర్ అభిజిత్ కూడా అక్కడికి వచ్చాడు.
అయితే మీటింగ్లో పాల్గొన్న సమిక్ భట్టాచార్య అనే బీజేపీ నాయకుడిని కలవడానికి సబ్యసాచి రాయ్ చౌదురి అనే వ్యక్తి ఆడిటోరియం వద్దకు వచ్చాడు. అతడిని చూసిన అభిజిత్.. గల్లా పట్టుకుని కొట్టడం ప్రారంభించాడు. సబ్యసాచి రాయ్.. టీఎంసీ నాయకుడని, ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశాడని ఆరోపించాడు. తన వద్ద కూడా పైసలు తీసుకున్నాడని చెబుతూ అతడిని విచక్షణా రహితంగా కొట్టాడు.
కాగా, తాను టీఎంసీ కార్యకర్తను కాదని, ఓ లాయర్నని సబ్యసాచి తెలిపారు. తాను బీజేపీ నాయకుడైన సమిక్ భట్టాచార్యను కలవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. దీనిని సమిక్ కూడా నిర్ధారించారు. ఈ వ్యవహారమంతా స్థానిక కెమెరాల్లో నిక్షిప్తమయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.