వరుస పరాజయాల తర్వాత దెబ్బతిన్న సింహంలా విజృంభిస్తున్న కోహ్లీ సేన.. గ్రూప్-2లో రెండో విజయం నమోదు చేసుకోవడంతో పాటు రన్రేట్ను భారీగా మెరుగు పర్చుకుంది. నాకౌట్ చేరాలంటే అద్భుతం జరుగాల్సిన స్థితిలో స్కాట్లాండ్తో మ్యాచ్లో మనవాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. జడ్డూ మ్యాజిక్ స్పిన్కు.. షమీ యార్కర్లు తోడవడంతో ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. లోకేశ్ రాహుల్ బంతిపై పగబట్టినవాడిలా ఆరంభం నుంచే విరుచుకుపడటంతో టీమ్ఇండియా భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది! ఆదివారం పోరులో న్యూజిలాండ్పై అఫ్గాన్ నెగ్గాలని ప్రార్థించడం తప్ప ప్రస్తుతం భారత్ చేతుల్లో ఏమీలేదు!
దుబాయ్: నాకౌట్ చేరడం కష్టమే అయినా.. సాంకేతికంగా రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా విశ్వరూపం కనబర్చింది. బౌలర్ల బాధ్యతాయుత ప్రదర్శనకు టాపార్డర్ మెరుపులు తోడవడంతో భారీ విజయం సొంతం చేసుకుంది. సూపర్-12లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ను చిత్తు చేసింది. మెగాటోర్నీలో తొలిసారి టాస్ గెలిచిన బర్త్డే బాయ్ విరాట్ కోహ్లీ.. స్కాట్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించగా.. నాణ్యమైన బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక ఆ జట్టు 85 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (3/15), మహమ్మద్ షమీ (3/15), జస్ప్రీత్ బుమ్రా (2/10) సమిష్టిగా సత్తాచాటడంతో పరుగులు రాబట్టేందుకు స్కాట్లాండ్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఓపెనర్ జార్జ్ మున్సే (24) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యఛేదనలో లోకేశ్ రాహుల్ (19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ 6.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 89 పరుగులు చేసింది. ఈ విజయంతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్న కోహ్లీ సేన గ్రూప్-2లో మూడో స్థానానికి చేరడంతో పాటు రన్రేట్ (+1.619)ను భారీగా మెరుగు పర్చుకుంది. తన స్పిన్తో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టిన రవీంద్ర జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. సోమవారం జరుగనున్న తదుపరి మ్యాచ్లో నమీబియాతో భారత్ తలపడనుంది.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్
తరఫున అత్యధిక వికెట్లు (64) పడగొట్టిన
బౌలర్గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. యుజ్వేంద్ర చాహల్ (63) రెండో స్థానంలో ఉన్నాడు.
స్కోరు బోర్డు
స్కాట్లాండ్: మున్సే (సి) హార్దిక్ (బి) షమీ 24, కోట్జర్ (బి) బుమ్రా 1, క్రాస్ (ఎల్బీ) జడేజా 2, బెర్రింగ్టన్ (బి) జడేజా 0, మ్యాక్లాడ్ (బి) షమీ 16, లీస్క్ (ఎల్బీ) జడేజా 21, గ్రీవ్స్ (సి) హార్దిక్ (బి) అశ్విన్ 1, మార్క్ వాట్ (బి) బుమ్రా 14, షరీఫ్ (రనౌట్/ (సబ్) ఇషాన్) 0, ఎవన్స్ (బి) షమీ 0, వీల్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 4, మొత్తం: 17.4 ఓవర్లలో 85 ఆలౌట్. వికెట్ల పతనం: 1-13, 2-27, 3-28, 4-29, 5-58, 6-63, 7-81, 8-81, 9-81, 10-85, బౌలింగ్: బుమ్రా 3.4-1-10-2, వరుణ్ 3-0-15-0, అశ్విన్ 4-0-29-1, షమీ 3-1-15-3, జడేజా 4-0-15-3.
భారత్: రాహుల్ (సి) మ్యాక్లాడ్ (బి) వాట్ 50, రోహిత్ (ఎల్బీ) వీల్ 30, కోహ్లీ (నాటౌట్) 2, సూర్యకుమార్ (నాటౌట్) 6, ఎక్స్ట్రాలు: 1, మొత్తం: 6.3 ఓవర్లలో 89/2. వికెట్ల పతనం: 1-70, 2-82, బౌలింగ్: మార్క్ వాట్ 2-0-20-1, బ్రాడ్ వీల్ 2-0-32-1, ఎవన్స్ 1-0-16-0, షరీఫ్ 1-0-14-0, గ్రీవ్స్ 0.3-0-7-0.