Kodangal | నాయకుడు వేసే అడుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రజాప్రతినిధి చేసే యోచన నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చాలి. కానీ, తాను తీస్మార్ఖాన్ అని చెప్పుకొనే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఈ మాటలు అస్సలు వర్తించవు. మీసాలు తిప్పడాలు, తొడలు గొట్టడాలే సిసలైన లీడరిజం అని ఆయన భావన! అందుకే, రెండు దఫాలు కొడంగల్కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా నియోజకవర్గంలో ఏ వర్గానికీ ఎలాంటి లబ్ధినీ చేకూర్చలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కొడంగల్ దశ మారింది. ఊరూరా జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుండగా, ఈసారీ ఓటమి తప్పదన్న ఫ్రస్ట్రేషన్ రేవంత్ ముఖంలో ప్రస్ఫుటిస్తున్నది.
తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గం పేరు తెలియనివారు ఉండరు. కానీ, తొమ్మిదేండ్ల కిందటి వరకు కొడంగల్ వాసులను పలకరిస్తే ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అని సమాధానం వచ్చేది. ఇప్పుడు కొడంగల్వాసి ముఖంలో కొండంత సంతోషం తొణికిసలాడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకతో నియోజకవర్గ ముఖచిత్రమే మారిపోయింది. ఒకప్పుడు కొడంగల్ పరిధిలోని దారులన్నీ గతుకులు, అతుకులతో ప్రయాణ భారాన్ని పదింతలు పెంచేవి. గుక్కెడు నీటి కోసం వాగుల్లో చెలిమెలు తీసిన చేతులెన్నో! అదే వానొస్తే.. వాగులు పొంగి పక్క ఊరితో సంబంధాలు తెగిపోయేవి. చిన్న సుస్తీ చేసినా పాలమూరుకు పరుగులు తీయడం తప్ప మరో గత్యంతరం ఉండేది కాదు. ఈ కష్టాలన్నిటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇప్పుడు దారులన్నీ హైవేలను తలపించేలా కొత్తరూపును సంతరించుకున్నాయి. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు డబుల్ రోడ్లను అభివృద్ధి చేయడంతో ప్రయాణ భారం తగ్గిపోయింది. మిషన్ భగీరథ పుణ్యాన కృష్ణమ్మ జలాలతో కొడంగల్ ప్రజలు తృప్తిగా దాహార్తిని తీర్చుకుంటున్నారు. కొత్తగా వెలసిన పల్లె దవాఖానలు, పట్టణ ఆసుపత్రులు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయి. శరవేగంగా నిర్మాణమవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తయితే నియోజకవర్గంలోని లక్షాయాభైవేల ఎకరాలకు దండిగా సాగునీరు అందుతుంది.
కొడంగల్ ఇజ్జత్ బర్బాత్..
పదేండ్లపాటు కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ కనీసం ఒక్కటంటే ఒక్క గ్రామానికి రోడ్డు వేసేందుకు నిధులు తీసుకురాలేకపోయారు. తాగునీటికి అలమటించిన ప్రజల కన్నీటి కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. నియోజవర్గాన్ని ఉద్ధరించకపోగా, బ్లాక్మెయిల్ దందాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారన్న విమర్శలు ఉన్నాయి. పైగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కొడంగల్ పేరును గంగలో కలిపాడని స్థానికులు పెదవి విరుస్తున్నారు. రేవంత్ అసలు స్వరూపం బయటపడటంతో 2018 ఎన్నికల్లో ఓటర్లు ఆయనకు కర్రుకాల్చి వాతపెట్టారు. పట్నం నరేందర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని తమ ప్రాంత అభివృద్ధికి నాంది పలికారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సీఎం అవుతానని రేవంత్ గప్పాలు పలుకుతున్నా.. బీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు కండ్లారా చూసిన కొడంగల్ ఓటర్లు మరోసారి గులాబీ జెండాకే తమ మద్దతని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
తొమ్మిదేండ్లలో రూ.1500 కోట్ల నిధులు
కొడంగల్లో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు. రూ.1,500 కోట్లకు పైగా నిధులతో నియోజకవర్గ అభివృద్ధి ఊహించిన దానికన్నా మిన్నగా కొనసాగింది. సంక్షేమ పథకాలతోపాటు వాగులపై చెక్డ్యాంలు, ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, మినీ ట్యాంక్బండ్, గురుకుల పాఠశాలలు, బస్డిపో, బస్ స్టేషన్లు ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతి పరుగులు పెట్టింది. మూడు దశాబ్దాలుగా సరైన రవాణా లేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్న కోస్గి ప్రజల బస్డిపో కల ఇన్నాళ్లకు నెరవేరింది. కొడంగల్, కోస్గిలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ప్రకటించింది. వాటి అభివృద్ధికి కోట్ల నిధులు వెచ్చించింది. రెండుచోట్లా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటైంది. సీసీ రోడ్లు, దుకాణ సముదాయాలు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రెండూళ్లు కొత్త కళను సంతరించుకున్నాయి. కొడంగల్లో 30 పడకల ప్రభుత్వాసుపత్రి, కోస్గిలో 50 పడకల దవాఖాన, మద్దూరులో 30 పడకల హాస్పిటల్ అందుబాటులోకి వచ్చాయి. కొడంగల్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కిడ్నీ వ్యాధి బాధితులకు కొండంత ఊరట లభించింది. నియోజకవర్గంలోని బొంరాసుపేట్లో బీసీ, కొడంగల్లో మైనార్టీ, మద్దూరులో ఎస్సీ గురుకులాలు మంజూరు చేయడంతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. కొడంగల్, కోస్గిలో యాదవ భవనాలు, ముదిరాజ్ భవనాలు, అంబేద్కర్ భవన్, కొడంగల్లో బంజారాభవన్ను నిర్మించి అన్ని వర్గాలకూ అండగా నిలిచింది ప్రభుత్వం. మొత్తంగా ‘ఇది నా అడ్డా’ అని రొమ్ము విరిచే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు చూసి తన భవిష్యత్తుపై బెంగపడటంలో వింతలేదు.