హాలియా, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో రెండేండ్లు గా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ప్రభుత్వం ఉన్నా, లేనట్లుగా వ్యవహరిస్తోంది. కోదాడ- జడ్చర్ల హైవే విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిధులు మంజూరైనా హాలియా వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై నూతన వం తెన నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం, వంతెన ఇరుకుగా ఉన్న కారణంగా ఈనెల 17న హాలియాలోని సాగర్ ఎడమ కాల్వ వంతెనపై ద్విచక్ర వాహనాన్ని, లారీ ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభుత్వ వైఫల్యం, అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. అందుకు ఎవరిది బాధ్యత అని బాధిత కుటుంబ సభ్యులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిధులున్నా సకాలంలో పనిచేయని కాంట్రాక్టర్దా, లేక కాం ట్రాక్టర్తో పనిచేయించని అధికారులదా లేక ఇద్దరినీ సక్రమంగా అజమాయిషీ చేయలేని ప్రభుత్వానిదా అని సామాజిక కార్యకర్తలు, ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
రెండేళ్లయినా పనుల్లో పురోగతి లేదు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు పూర్తయినా కోదాడ -జడ్చర్ల రోడ్డు విస్తరణ పనుల్లో కనీసం 2 శాతం కూడా పూర్తి కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత కోదాడ జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. పెద్దవూర వద్ద ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమై నత్తనడకన సాగుతుండగా హాలియా ఎడమ కాల్వపై నూతన వంతెన నిర్మాణం, పెద్దవూర మండలం రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద నూతన వంతెనల నిర్మాణం ఇప్పటికి చేపట్టక పోవడం గమనార్హం.
నిత్యం వందలాది మంది ప్రయాణం
హాలియాలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ వంతెనపై నుంచి నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వంతెనపై నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. వంతెన ఇరుకుగా ఉండటంతో ఎదురుగా భారీ వాహ నం వస్తే కాల్వకు ఇటువైపు ఉన్న వాహనదారుడు వాహనం నిలిపివేయాల్సిందే. ఎవరై నా ఆదమరచి వాహనం నడిపితే అంతే సంగతులు. ఈ నెల 17న పెద్దవూర నుంచి హాలియాకు వస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో బైక్పై వెళ్తున్న దంపతులు ఇద్దరు లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు.

వంతెన అవతలే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు
హాలియా మున్సిపల్ కార్యాలయంతో పాటు అనుముల మండల ప్రభుత్వ కార్యాలయాల న్నీ కాల్వకు అవతలి వైపే ఉన్నాయి. అదేవి ధంగా శివాలయం, బ్రహ్మంగారి ఆలయం, ఎ ల్లమ్మగుడి, మార్కెట్ యార్డు, ఆర్అండ్బీ అతిథిగృహాలు ఉన్నాయి. కాల్వకు ఇవతలి వైపున ప్రభుత్వ పాఠశాల, కళాశాల, వసతి గృహాలు ఉన్నాయి. కాల్వ కట్టకు ఇరువైపులా హాలియా మున్సిపాలిటీ విస్తరించి ఉన్నది. అందువల్ల రోడ్డు విస్తరణ, నూతన వంతెన నిర్మాణం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.
వంతెన పూర్తి చేసి ఉంటే బాగుండే..
హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వపై వంతెన చాలా ఇరుకుగా ఉంది. వాహనాలు రెండూ ఎదురుపడితే అటు ఇటు వెళ్లలేని పరిస్థితి. కోదాడ-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు దాదాపు పూర్తయినప్పటికీ ఇక్కడ నూతన వం తెన నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి.
బీఆర్ఎస్ పాలనలోనే 95 శాతం పనులు పూర్తి..
కోదాడ-జడ్చర్ల మధ్య ఉన్న 214 కిలోమీటర్ల హైవే గతంలో ఆర్అండ్బీ రహదారిగా ఉండేది. తెలంగాణ ఏర్పాటైన అనంతరం ఈ రహదారిలో వాహనాల రద్దీని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ రహదారిని హైవేగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చింది. స్పందించిన కేంద్ర ప్రభుత్వం కోదాడ-జడ్చర్ల రహదారిని 167 జాతీయ రహదారిగా గుర్తించి, రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.1200 కోట్లు విడుదల చేసింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం పనులను సకాలంలో పూర్తి చేసేందుకు రహదారి విస్తరణ పనులను 5 ప్యాకేజీలుగా విభజించింది. బీఆర్ఎస్ హయాంలోనే 95శాతం పను లు పూర్తయ్యాయి. మొదటి ప్యాకేజీలో పనులు పూర్తి కాగా, రెండో ప్యాకేజీలో కల్వకూర్తి చారగొండ మధ్య 2 కిలోమీటర్లు, మూడో ప్యాకేజీలో రంగరెడ్డిగూడెం, పెద్దవూర, హాలియా ఎడమ కాల్వపై నూతన వంతెన నిర్మాణంతోపాటు సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డు వేయా ల్సి ఉంది. ఐదో ప్యాకేజీలో హుజుర్నగర్ గరిడేపల్లి మధ్య సుమారు 10 కిలోమీట్ల మేర రోడ్డు విస్తరణ పనులు మిగిలిపోయాయి.