రామారెడ్డి, మార్చి 28: వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే ఆమెకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన బంధువులు అమానవీయంగా ప్రవర్తించారు. వృద్ధురాలి ఆస్తి కోసం మృతదేహం ఎదుటే ఘర్షణకు దిగారు. ఆస్తి తమదంటే తమదని పరస్పరం దాడులు చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం చనిపోతే, గురువారం రాత్రి దాకా అంత్యక్రియలు చేయకుండా పంపకాల కోసం కొట్లాటకు దిగారు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇసన్నపల్లికి చెందిన చింతల కిష్టవ్వ (55)కు వారసులు లేరు.
ఆమెకు గ్రామంలో 40 గుంటల భూమి, ఇల్లు ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కిష్టవ్వ బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. అయితే, దహన సంస్కారాలు నిర్వహించాల్సిన బంధువులు ఆస్తి కోసం తగువులాటకు దిగారు. కిష్టవ్వ అనారోగ్యంతో ఉంటే మేమే సపర్యలు చేశామని, అంత్యక్రియలు తామే చేస్తామని ఆమె చెల్లెలి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అయితే, తమకు రూ.2 లక్షలు ఇస్తేనే దహన సంస్కారాలు చేయనిస్తామని కిష్టవ్వ మరిది చింతల మైసయ్య, ఆయన భార్య, కొడుకులు పట్టుబట్టారు. గురువారం ఉదయం మొదలైన ఈ గొడవ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
వాగ్వాదం చేసుకున్న రెండు కుటుంబాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో మైసయ్య కుమారుడు రవీందర్ తల్వార్ తీసుకొచ్చి.. మృతురాలి చెల్లెలి కొడుకు అయిన రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అప్పరబోయిన నర్సింహులుపై దాడి చేశాడు. ఈ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో నర్సింహులు చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఆస్తుల గొడవ తర్వాత చూసుకోవచ్చని, ముందు అంత్యక్రియలు జరిపించాలని పోలీసులు, కులస్తులు సర్దిప్పడంతో ఇరువర్గాల వారు శాంతించారు. చివరికి గురువారం రాత్రి కిష్టవ్వ దహన సంస్కారాలు పూర్తి చేశారు.