ఊర పిచ్చుకల కిచకిచలు.. కోకిలల కిలకిలారావాలు.. సీతాకోక చిలుకల సప్తవర్ణాలు.. జింకలు, దుప్పుల చిరు నడకలు.. అడవి దున్నల రంకెలు.. నెమళ్ల నాట్య విన్యాసాలు.. ఈ దృశ్యాలు ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో కనిపిస్తున్నాయి.. చూపరులకు కనువిందు చేస్తున్నాయి.. తెలంగాణ ప్రభుత్వ కృషికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఈ కల సాకారమైంది.. జీవవైవిధ్యానికి ఊపిరినిచ్చింది.. వన్యప్రాణుల పునరాగమనానికి బాటలు వేసింది.. ఈ ప్రస్థానంపై ‘నమస్తే’ నేటి సండే స్పెషల్.
– ఖమ్మం, మే 21
ఖమ్మం, మే 21: కాలంతో పరిగెత్తుతున్న మానవుడు తనతో కలిసి జీవించిన అనేక జీవాలు, కీటకాల ప్రాణాలను లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా వాటిలో కొన్ని జాతులు తమ ఉనికిని కోల్పోయాయి. మరికొన్ని జాతులు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టాయి. పక్షులు కనుమరుగయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను పునరుద్ధరించడం, హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటడం, గ్రామగ్రామాన అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడం, అటవీ ప్రాంత విస్తరణకు చర్యలు తీసుకోవడంతో తిరిగి జీవవైవిధ్యానికి చోటు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 28శాతం ఉన్న అటవీప్రాంతాన్ని 33 శాతం పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుని పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఒక్క జిల్లాలోనే సుమారు 12 కోట్ల మొక్కలు నాటడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో జీవకోటి తిరిగి జవసత్వాలు పోసుకుంటున్నది. యావత్ తెలంగాణతో పాటు ఉమ్మడి జిల్లాలోనూ వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. వందల సంఖ్యలో పక్షుల జాతులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. తల్లాడ దగ్గర్లోని కనకగిరి రిజర్వ్ ఫారెస్టులో చిరుతపులి సంచరిస్తున్నట్లు ఇటీవల అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. చిరుతపులి మాత్రమే కాకుండా ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, నీలిగాయ, అడవిదున్న, నెమళ్లు, అడవి కుందేళ్లు, అడవి పందులు, గువ్వలు, కోకిలలు, ఊర పిచ్చుకలు అటవీప్రాంతంలో కనిపిస్తున్నాయి.
కొన్నేళ్ల క్రితం ప్రతి పల్లెలో కాకి, గద్ద, గువ్వ, గోరింక, గోగరగాళ్లు, పాలపిట్ట, చిలకలు కనిపించేవి. కొన్ని రకాల పక్షులు చెట్లపైనే గుడ్లు పెట్టేవి. క్రమక్రమంగా పక్షి జాతులు అంతరించిపోయాయి. కొన్ని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయి. భూమి మీద, సోరంగాల్లో గుడ్లు పెట్టే బురకలు, కౌజులు మాత్రమే అక్కడక్కడా కనిపించేవి. అటవీప్రాంతంలో తినడానికి ఆహారం దొరక్క, తాగడానికి నీరు లేక కోతులు పల్లెలు, పట్టణాల బాట పట్టాయి. కోతులు అడవులకు వాపస్ పోవాలె.. వానలు దండిగా కురవాలె.. అన్న నినాదంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం చేపట్టింది. ఫలితంగా కోతులు తిరిగి అడవిబాట పడుతున్నాయి.
అటవీప్రాంతం క్షీణించిపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, రేడియేషన్ ప్రభావంతో వందల రకాల పక్షులు అంతరించిపోయాయి. గతంలో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ కనిపించిన పిచ్చుకలు క్రమక్రమంగా కనుమరుగయ్యాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో అటవీప్రాంత విస్తీర్ణం పెరుగుతున్నది. కోట్లాది మొక్కలు నాటడంతో క్రమంగా కాలుష్యం తగ్గుతున్నది. వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో ఇప్పుడు ఊర పిచ్చుకలతో పాటు ఇతర జీవాలు ఊపిరిపోసుకుంటున్నాయి. ప్రతి చోటా ఇప్పుడు పిచ్చుకలు దర్శనమిస్తున్నాయి.
అంతరించిపోతున్న అడవులను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో ఏడేండ్ల నుంచి కోట్లాది మొక్కలు నాటుతున్నది. పల్లెల్లో ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేసింది. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రహదారుల పక్కన మొక్కలు నాటించింది. జిల్లాలో విరివిగా చెక్డ్యాంలు, భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగింది. మొక్కలకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి.
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో జిల్లాలో వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. అటవీప్రాంతాల్లో వందలాది పక్షి జాతులు దర్శనమిస్తున్నాయి. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చూసిన పక్షులు, జీవాలన్నీ ఇప్పుడు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కనకగిరి, లంకపల్లి రిజర్వ్ ఫారెస్టులో విరివిగా వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
-ప్రవీణ, ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారి