ఖమ్మంరూరల్, మే 21 : గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరగాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మంరూరల్ మండల పరిధిలోని పెద్దతండా, ఏదులాపురం గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలితో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే చేపట్టిన, ప్రతిపాదించిన పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పెద్దతండా పంచాయతీలోని టీఎన్జీఓస్ కాలనీ, ఇందిరమ్మకాలనీలో సీసీ రోడ్ల పనులను తనిఖీ చేసిన కలెక్టర్ గ్రామంలో రూ.1.17 కోట్లతో 35 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గాను 26 పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రూ.2.18 కోట్లతో ప్రతిపాదించిన 33 సీసీ రోడ్లు, డ్రైన్ల పనులను పరిశీలించారు. ఏదులాపురంలో రూ.1.29 కోట్లతో ప్రతిపాదించిన సీసీ రోడ్లు, డ్రైన్ల పనులను పరిశీలించిన కలెక్టర్ కాలనీవాసులతో మాట్లాడుతూ పారిశుధ్య పనులు, చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, వీధి దీపాలు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
టీఎన్జీవోస్ కాలనీలోని మరికొన్ని వీధుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఇందిరమ్మ కాలనీ అంగన్వాడీ సెంటర్కు కంపౌండ్వాల్, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదులాపురం పంచాయతీ సత్యనారాయణపురంలో ప్రతిపాదించిన సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. మారుతీనగర్, శ్రీరాంనగర్లో ప్రతిపాదించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు పనులను పరిశీలించారు.
అనంతరం గ్రామ పంచాయతీల పరిధిలోని వెంచర్లను పరిశీలించి, రిజిస్ట్రేషన్, గ్రీన్బెల్టు స్థలం కేటాయింపు గురించి అధికారులతో చర్చించారు. ప్రతి వెంచర్లో తప్పనిసరిగా గ్రీన్బెల్టు స్థలం ఉండాలని, అందులో హరితహారం నర్సరీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆటోనగర్, ఏదులాపురం హరితహారం నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. నర్సరీ ఎదురుగా పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేవీకే శ్రీనివాసరావు, డీపీవో హరిప్రసాద్, పంచాయతీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శివనగేశ్, ఎల్.శ్రీనివాస్, పెద్దతండ పంచాయతీ అధికారి ఏ.శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ టి.సుమ, ఎంపీడీవో అశోక్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.