ఇడుక్కి: కేరళలో దారుణం జరిగింది. భూ తగాదాలతో సొంత కొడుకు కుటుంబాన్నే అంతమొందించాడో తండ్రి. కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపుళలోని చీనికుళికి చెందిన హమీద్ (79) అనే వ్యక్తి శనివారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన కుమారుడు ఫైజల్, కోడలు, ఇద్దరు మనుమరాళ్లు నిద్రిస్తుండగా, ఇంటి బయటి నుంచి తలుపు గడియ పెట్టాడు. ఆ తర్వాత పెట్రోల్ బాటిళ్లను ఇంటిలోకి విసిరి నిప్పంటించాడు. వెంటనే ఇళ్లంతా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నలుగురూ కాలి బూడిదయ్యారు. తమను కాపాడాలంటూ బాధితులు అరిచినా అప్పటికే మంటలు వ్యాపించడంతో పొరుగు వారు వారిని కాపాడలేకపోయారు. పైగా మంటలు అంటుకున్నాక నీటితో ఆర్పేసుకుంటారని ట్యాంకులోని నీళ్లన్నీ ముందే ఖాళీ చేశాడు. పక్కనే ఉన్న బావిలో నుంచి నీటితో స్థానికులు మంటలు ఆర్పేస్తారన్న అనుమానంతో బకెట్, తాడు కూడా పడేశాడు. పోలీసులు హమీద్ను అరెస్టు చేశారు. తండ్రీ కూతుళ్ల మృతదేహాలు ఒకరినొకరు కౌగిలించుకుని ఉండటంతో అక్కడ ఉన్న వారందరి కళ్లు చెమ్మగిల్లాయి.