తిరువనంతపురం : కేరళలో నిపా వైరస్ కలకలం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు కేరళలో 68 మందిని ఐసోలేషన్కు తరలించారు. వీరందరినీ కోజికోడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను ఐసోలేషన్లో ఉంచారు. వైరస్ పరిస్థితిపై బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ మాట్లాడారు. వైరస్ కారణంగా 68 మంది బాధితులు ఐసోలేషన్లో ఉన్నారని, బాధితులందరి ఆరరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. నిపా బాధితుడి కాంటాక్ట్ ట్రేసింగ్ సమయంలో గుర్తించి, సదరు వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో ఇప్పటి వరకు 30 మంది నెగెటివ్గా పరీక్షించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో నిపా వైరస్ మొదటి కేసు గుర్తించినప్పటి నుంచి ఆరోగ్యశాఖ మంత్రి గత నాలుగు రోజులుగా కోజికోడ్లోనే ఉంటున్నారు. కోజికోడ్లో 12 ఏళ్ల బాలుడు నిపా వైరస్ సోకి మృతి చెందగా.. కాంటాక్ట్ ట్రేసింగ్ సమయంలో 251 మందిని గుర్తించారు. వీరిలో 129 మంది ఆరోగ్యకార్యకర్తలు, 54 మంది హై రిస్క్ కేటగిరిలో ఉన్నారు. గుర్తించిన మొత్తం కాంటాక్టుల్లో 11 సిమ్టోమేటిక్ కాగా.. 54 హై రిస్క్ కేటగిరిలో 30 మంది ఆరోగ్య కార్యకర్తలు. వీరు ఎంసీహెచ్, కోజికోడ్లోని ఒక క్లినిక్తో పాటు నాలుగు దవాఖానాల నుంచి వచ్చారు. ఈ ఏడాది తొలి నిపా కేసును గుర్తించిన నేపథ్యంలో ఆదివారం కేంద్ర బృందం కోజికోడ్కు ప్రత్యేక బృందాన్ని పంపింది. రాష్ట్రానికి సాంకేతిక సహకారం అందించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం తరలించింది.