ఆర్కేపురం: దళితబందు పథకంపై ప్రతిపక్ష పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేపడుతున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం మోత్కుపల్లి ఇంటికి వెళ్లిన పడిమర్తి రవి ఆయనను శాలువా, పూలమాలతో సన్మానించారు.ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ దళుతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు దళితులు ఈరోజు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితులు సమాజంలో ఉన్నారని అప్పుడు ఎందుకు వాళ్ళ అభ్యున్నతికి కృషి చేయలేదని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళితబందు పథకం తీసుకొస్తే దానిపై తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు అడ్డుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అని రాష్ట్రంలో ఏదో ఇబ్బందికర వాతావరణం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ పరిపాలనలో దళితులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారని, దానిని ఓర్వలేక బండి సంజయ్ పాదయాత్ర, రేవంత్రెడ్డి దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాపోలు రాములు, రంగారెడ్డి జిల్లా మాదిగ జేఏసీ చైర్మన్ నక్క శరత్కుమార్, ఎలిమినేటి ప్రశాంత్, రాజు, సాయి, సతీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.