Adilabad| స్వరాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం చేరవేస్తున్నది. సకల జనుల హితమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు వివిధ పథకాలు అమలు చేస్తూ భరోసానిస్తున్నది. రైతులు, పేదలు, ఆడబిడ్డలు, అభాగ్యులు.. ఇలా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నది. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, ఉచిత చేప పిల్లలు, సబ్సిడీ గొర్రెల పంపిణీ, గిరివికాసం, తదితర స్కీమ్లతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఇక దళిత వర్గాలు సగర్వంగా తలెత్తుకునేలా ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా దళితబంధు, దళితబస్తీ అమలు చేస్తున్నది. ఇలా ఒక్కటేమిటి.. సర్కారు చేపట్టిన ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో జిల్లా దశ,దిశా పూర్తిగా మారిపోయింది. గతంలో సమైక్యపాలకుల నిర్లక్ష్యం కారణంగా గోస పడ్డ జిల్లా ప్రజానీకం, నేడు తమ కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతుండడంతో మురిసిపోతున్నది.
ఆదిలాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సర్కారు పథకాలు అందేవి కావు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు, కులవృత్తిదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. పంట పెట్టుబడులు వెళ్లక, గ్రామాల్లో ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లా ప్రజల పాలిట వరంగా మారాయి. సర్కారు అందిస్తున్న సాయంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. కులవృత్తులకు గ్రామాల్లోనే ఉపాధి లభిస్తుంది. ఒక్కో ఇంటికి మూడు నుంచి 6 సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సబ్బండ వర్గాలకూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని సర్కారు మేలు చేస్తుండగా, తద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయని లబ్ధిదారులు మురిసిపోతున్నారు.
గత పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా జిల్లాలో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడేవారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతును రాజుగా మార్చాయి. పంటపెట్టుబడుల కోసం దళారుల చుట్టూ తిరిగే అన్నదాతలకు ఇప్పుడా ఇబ్బంది లేకుండా పోయింది. రైతుబంధు పథకంలో భాగంగా సర్కారు ఎకరాకు రూ. 10 వేలు అందిస్తుండడంతో సకాలంలో పంటలు వేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,45,711 మంది రైతులకు ప్రభుత్వం ప్రతి సీజన్కు రూ. 265.66 కోట్లను పంట పెట్టుబడి కింద అందజేస్తున్నది.
బాధిత రైతు కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబాల్లోని పెద్దదిక్కు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గత ఐదేండ్లలో వివిధ కారణాలతో 845 మంది రైతులు మరణించగా, సంబంధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ. 42.25 కోట్లు అందజేశారు. మొదట్లో రూ.5లక్షల బీమా డబ్బులను బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం, తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. కాగా జిల్లాలో 105748 మందికి రైతుబీమా పథకం వర్తిస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు అభాగ్యుల పాలిట వరంగా మారాయి. జిల్లాలో ప్రతి నెలా 76,195 మంది లబ్ధిదారులకు రూ. 17.44 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో 30,392 వృద్ధాప్య పింఛన్లు, 7178 మంది దివ్యాంగులు, 29,054 మంది వింతంతు, 5,538 మంది బీడీ కార్మికులు, 2272 మంది ఒంటరి మహిళలు, 42 మంది కల్లు గీత కార్మికులు, 17 మంది చేనేత కార్మికులకు పింఛన్ అందుతున్నది. సర్కారు అందజేసే పింఛన్లతో వీరికి గౌరవం పెరిగింది.
గతంలో ఆడపిల్లల వివాహాలు చేయాలంటే తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి. చేసిన అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడాల్సి వచ్చేది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆడపిల్లల తల్లిదండ్రుల బెంగను దూరం చేసింది. ఈ పథకంలో భాగంగా పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం రూ. 1,00,116 అందజేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 24,694 మంది లబ్ధిదారులకు రూ. 219.60 కోట్లను సర్కారు పంపిణీ చేసింది. తమ పిల్లల పెండ్లికి సర్కారు అందిస్తున్న సాయంపై పేదింటి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వందరోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో వైద్యబృందాలు గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.23 లక్షల మందికి కంటి పరీక్షలు చేయనుండగా ఇప్పటి వరకు 1,74,537 మందికి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు.
మహిళల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. దీంతో పాటు అమ్మఒడి పథకంలో భాగంగా మగపిల్లాడు పుడితే రూ. 12 వేలు, ఆడశిశువు జన్మిస్తే రూ. 13 వేలతో పాటు రూ. 2 వేల విలువ చేసే కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. కిట్లోని వస్తువులు తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. పౌష్టికాహార లోపం కారణంగా గర్భిణుల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంది. దీంతో కాన్పు సమయంలో వారు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. జిల్లాలోని గర్భిణుల్లో రక్తహీనత తగ్గించడం, సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నది.
భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా మూడెకరాలను పంపిణీ చేస్తున్నది. భూముల కొనుగోలు పథకంలో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 1883 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 4787 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఇందుకు గాను రూ. 208 కోట్లను సర్కారు వెచ్చించింది. ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిలో దళిత రైతులు రెండు పంటలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. భూమి పంపిణీ చేసిన రైతులకు రూ. 8.40 కోట్ల పంట పెట్టుబడి సాయాన్ని కూడా ప్రభుత్వం అందజేసింది.
మా కుటుంబానికి మొదటి విడుతల ఒక గొర్రెల యూనిట్ ఇచ్చిండ్రు. మాది ఎవుసం చేసుకుంటనే నడిసే కుటుంబం. ఇప్పుడు గొర్లు మేపుడు, అటు ఎవుసం పనులు చూస్కుంటున్నం. గీ జీవాలతోని మాకు ఆర్థికంగా కలిసి అచ్చింది. ఇగ గ్రామంల గొర్ల కాపరుల సంఘం సూత పన్జేస్తున్నది. రెండో విడుతల సూత గొర్ల యూనిట్లు అస్తున్నయ్. మా సర్పంచు శ్రద్ధతోని అర్హులందరికీ జీవాల మందలు అస్తున్నయి. తెలంగాణ అచ్చినంకనే మా బతుకుల్ల వెలుగులు నిండినయ్. మా ఇబ్బందుల్ని పట్టించుకున్న లీడరు సీఎం కేసీఆర్ సారు ఒక్కరే. ఆయన సల్లంగుంటే పేదోళ్లందరూ మంచిగుంటరు. లేకుంటే గతంలో లెక్క కష్టాలు పడుడే అయితది. తెలంగాణ తెచ్చుకున్నంకనే బడుగుల జీవితాలకు భరోసా అచ్చింది. ఇప్పుడిప్పుడే మా జీవితాల్లో మార్పు వస్తున్నది.
– రెడ్డి దేవన్న యాదవ్, లబ్ధిదారు, కరంజి(టీ), భీంపూర్ మండలం
భీంపూర్ మండలంల మా గ్రామం కరంజి(టీ) ఆఖరిది. ఇక్కడే నాకు మూడెకరాల భూమి ఉన్నది. దీనికి ఏటా రెండు విడుతల్ల కలిపి రూ.30 వేలు రైతు బంధు కింద వస్తున్న ది. ఇగ మా గ్రామం శివారు దాటినంక మహారాష్ట్ర, నాగపురంల సూత మూడెక రాల భూమి ఉన్నది. అక్కడ మాత్రం సర్కారు సాయం లేదు. గట్ల ఈడికి ఆడికి మస్తు ఫరాకు ఉన్నది. గీ రైతుబంధుతోనే మా ఎవుసంల కళ అచ్చింది. రెండు పంటలు పండిస్తు న్నం. కేసీఆర్ సారు పుణ్యమని ఎవుసం మంచిగైంది. లేకుంటే చాలా ఇబ్బందయితుండే. గతంలో ఆయన లెక్క ఏ ఒక్కలూ రైతుల్ని ఆదుకు నే మంచి పని జెయ్యలే. ఇయ్యాల రైతులు సంతోషంగా ఉంటున్న రంటే కారణం ఆయనే. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటం.
– దేరెడ్డి శ్రీనివాస్ యాదవ్, రైతు, కరంజి(టీ)
మాది తాంసి మండలం గిరిగాం గ్రామం. భీంపూర్ పీహెచ్సీ పరిధిలోకి వస్తుంది. నేను గర్భిణిగా ఈ పీహెచ్సీలో నెలనెలా పరీక్షలు చేయించుకుంటున్న. మొన్న నాకు కేసీఆర్ సారు న్యూట్రిషన్ కిట్ అందజేసిండ్రు. అందులో మాకు బలవర్ధక ఆహారం అందజేస్తున్నరు. ఇవే బయట కొనాలంటే కష్టం. ఈ కిట్ గర్భిణులకు ఒక వరం. మహిళలకు సర్కారు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తున్నది. ఇట్ల చేసుడు మాములు మాట కాదు. సీఎం కేసీఆర్ సారు చెయ్యబట్టే ఇయ్యాల మంచి రోజులు నడుస్తున్నయ్.
– చిక్రం సుగుణ ,గిరిగాం