ఉమ్మడి రాష్ట్ర పాలకుల అసమర్థ నిర్ణయాల వల్ల కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. వారి పాలన కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు చాలీచాలని జీతాలు ఉండేవి. కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు సమ్మెలు, ధర్నాలు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. వారిచ్చే వినతి పత్రాలు సైతం తీసుకునేవారు కాదు. వారి మొర ఆలకించే నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ తరుణంలోనే కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగులు సైతం వెన్నంటి నిలిచారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. ఇప్పుడు పాటించారు.
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ పలు వేదికలపై మాట్లాడారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తొలి ఏడాది సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం జీవో నెంబర్ 16ను జారీ చేశారు. కానీ విపక్షాల ద్వంద్వ వైఖరి వల్ల కోర్టులో అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కాంట్రాక్టు ఉద్యోగులు కేసీఆర్పై నమ్మకంతో స్వరాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనడంలో వెనుకాడలేదు. విపక్షాలు రెచ్చగొట్టినా సమ్మెలు, ధర్నాలు చేయలేదు. ఏనాటికైనా కేసీఆర్ మాత్రమే తమకు న్యాయం చేస్తారన్న ధీమాతో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా నిలిచారు. వారి నమ్మకానికి అనుగుణంగానే సీఎం రెగ్యులర్, కాంట్రా క్టు అనే తేడా లేకుండా ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ 2017 నుంచి కేసీఆర్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం అమలు చేసింది. అ తర్వాత 2018లో ఎన్నికలకు వెళ్లే ముందు మంత్రి హరీష్ రావు చొరవతో కాంట్రాక్టు ఉద్యోగులందరికీ పన్నెండు నెలల వేతన సదుపాయం కల్పించింది ప్రభుత్వం. 2021లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తించేలా చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించి అమలు చేశారు.
2021 డిసెంబర్ నెలలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమల్లో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారం కేసీఆర్ కొత్త సచివాలయం సాక్షిగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చారిత్రాత్మకమైన ప్రకటన చేశారు.
ఎన్నో గొప్ప నిర్ణయాల ద్వారా సబ్బండ వర్ణాలకు న్యాయం చేసిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం ద్వారా వేలాది కుటుంబాల్లో సంతోషం నింపారు. సీఎం నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు ఆనందం వెలిబుచ్చుతున్నారు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని సగర్వంగా మద్దతు ప్రకటిస్తున్నారు.
డా. తిరుపతి పోతరవేణి: 9963117456
(వ్యాసకర్త : ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంట్రాక్టు జూనియర్లెక్చరర్ల సంఘం)