హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ‘లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 సీట్లు గెలుస్తుంది.. తెలంగాణకు ప్రధాన శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్లతో మా పోరాటం కొనసాగుతుంది’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఏఎన్ఐకి మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, సార్వత్రిక ఎన్నికల్లో ఏ కూటమికీ 272 సీట్ల సంపూర్ణ మెజార్టీ రాదని, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కచ్చితంగా ప్రాంతీయ పార్టీలే కీలకం కాబోతున్నయని కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్నది నా కల. దాన్ని వందకు వంద శాతం సాధించిన. స్వరాష్ట్రంలో పాలన కూడా బాగా జరిగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలకు ప్రజలు ఆకర్షితులైండ్రు. ఇప్పుడు మోసపోయినమని తెలుసుకున్నరు. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత వందశాతం మంచి పరిణామం ఉంటుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కనీసం 12 సీట్లు గెలుస్తం.
ఎవరికి ఇబ్బందవుతుందనేది మాకు సంబంధం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో వందశాతం మంచి పరిణామం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది.
మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులందరినీ ఇబ్బంది పెట్టింది. ఎన్ని చోట్ల ఎమ్మెల్యేలను కొన్నరు, ఎంత మంది సీఎంలను గద్దె దింపిండ్రు, ఎన్ని ప్రభుత్వాలను కూలదోసిండ్రు, ఎన్ని అరాచకాలు చేసిండ్రో ప్రజలందరికీ తెలుసు. నాపై, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై మాత్రం వాళ్లు చెయ్యి వెయ్యలేకపోయిండ్రు. మేం ప్రజానాయకులం, శక్తివంతమైన నేతలం కాబట్టి మా వరకు రాలేకపోయిండ్రు. అందుకే మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ కేంద్రంగా నాటకం రచించిండ్రు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఎక్సైజ్ పాలసీని ఒక కుంభకోణంగా చిత్రీకరించిండ్రు. అసలు మద్యం పాలసీలో అవినీతికి అవకాశమే లేదు. ఇదొక తప్పుడు కేసు. ఇప్పటివరకు రూపాయి కూడా పట్టుబడలేదు. కానీ, ఈ కేసును అడ్డం పెట్టుకొని కేజ్రీవాల్ను, ఎమ్మెల్సీ కవితను జైలులో పెట్టిండ్రు. వాళ్లిద్దరూ నిర్దోషులు. నేను దేశ ప్రజలకు మరోసారి స్పష్టంగా చెప్తున్నా. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది అసలు స్కామే కాదు. ఇది మోదీ సృష్టించిన రాజకీయ కుంభకోణం మాత్రమే. ఎవరిని జైలులో పెడుతున్నరు? ఎవరిని వదిలేస్తున్నారో చూస్తే ఇది స్పష్టంగ అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఈ కేసులో అప్రూవర్గా మారగానే అతనికి బెయిల్ వచ్చింది. ఆయన బయటికి వెళ్లి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు చందా ఇచ్చిండు. ఒక ముఖ్యమంత్రికి బెయిల్ ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమో న్యాయస్థానాలు ఆలోచించాలి. నా బిడ్డ కవిత ఓ ఎమ్మెల్సీ, స్టార్ క్యాంపెయినర్. ఆమె ఎక్కడికైనా పారిపోతుందా? ఎందుకు బెయిల్ దొరుకడం లేదు?. నెలలపాటు జైలులో ఎలా ఉంచుతారు?. ఒకవేళ రేపు నిర్దోషిగా తేలితే.. ఇంతకాలం జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుతారు?. న్యాయవ్యవస్థకు నా విన్నపం ఏమిటంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఎమ్మెల్సీ కవిత వంటివారిని ఎప్పటివరకు జైలులో ఉంచుతారో ఆలోచించాలి. వారికి వెంటనే ఉపశమనం కల్పించాలి.
మేము రెండు పార్టీలతో పోరాడుతున్నం. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణకు శత్రువులు. అనేక అంశాల్లో ఇది రుజువైంది. అందుకే రెండు పార్టీలతో మా పోరాటం కొనసాగుతుంది.
కచ్చితంగా ఉన్నది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల బలం పెరిగింది. బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ ఇందుకు ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నయ్.
ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుంది. ఈ ఎన్నికల్లో ఏ కూటమికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదు. ఎన్డీయే కూటమి కూడా పెద్దదేం కాదు. ఎన్డీయేకు 200 సీట్లు కూడా దాటవు. ఫలితాల తర్వాత విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటయ్.
ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యబోతున్నరు. ఇక కాంగ్రెస్ హయాం లో జరిగిన కుంభకోణాలు, అవినీతి గురించి ప్రజలందరికీ తెలుసు. రైతులకు బీజేపీ, కాంగ్రెస్లు అన్యాయం చేసినయ్.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిందే జాతీయ స్థాయిలో మరింత విస్తరించేందుకు. మహారాష్ట్ర నుంచి ప్రారంభించినం. ఒడిశా, ఛత్తీస్గఢ్లో కూడా కొంత పనిచేసినం. అనుకోకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినం. నా దృష్టిలో ప్రాంతీయ పార్టీలు ఒకేచోట పరిమితం కాకూడదు.