హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో శూన్యత ఉన్నదని, ఆ శూన్యతను పూరించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. తనవంతుగా దేశ రాజకీయాలను సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. సోమవారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 నుంచి దేశ రాజకీయాలు కొత్త క్రాంతి బాటలో పయనిస్తాయని, కేసీఆర్ చెప్తే అది జరిగి తీరుతుందని అన్నారు. కలిసొచ్చే నేతలతో చర్చలు జరుపుతామని, ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉన్నదని, అందులో ఉత్తమమైనదాన్ని ఎంచుకొంటామని వెల్లడించారు. కదిలించాల్సింది నలుగురు నాయకులనో, ముగ్గురు సీఎంలతో కాదని, కదిలించాల్సింది భారత ప్రజానీకాన్ని అని స్పష్టంచేశారు. తమది బీజేపీకో, కాంగ్రెస్కో వ్యతిరేక ఫ్రంట్ కాదని, భారత ప్రజల అనుకూల ఫ్రంట్ అని, ప్రజల మేలు కోరే రాజకీయ ఫ్రంట్ అని చెప్పారు. తన 50 ఏండ్ల రాజకీయ అనుభవంతో చెప్తున్నానని, జాతీయ రాజకీయాల్లో కచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీ వస్తుందన్నారు. ఇప్పు డే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఈ క్రమం లో తాను వంద శాతం కీలక భూమిక పోషిస్తానని చెప్పారు. దేశంలో చాలా లోతైన సమస్యలు ఉన్నాయని, 75 ఏండ్లలో దేశాన్ని ఎంత గోల్మాల్ తిప్పారన్న అధ్యయనాలు ఉన్నాయని తెలిపారు. దేశంలో అడ్వకేట్ల సంఖ్య 20 లక్షలు ఉన్నదని, 1,018 యూనివర్సిటీలు, 45 వేల నుంచి 65 వేల వరకు డిగ్రీ కాలేజీలున్నాయని.. వీరందర్నీ కదిలిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆ పని ప్రారంభమైందన్నారు. ప్రశాంత్ కిశోర్ సైతం ఇందులో భాగస్వామిగా ఉన్నారని, ఆయన తన పని తాను చేస్తున్నారని చెప్పారు. దేశ రాజకీయాలను క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్గా తీర్చిదిద్దేలా తన ప్రయత్నం ఉంటుందన్నారు. చినజీయర్తో గ్యాప్ ఏర్పడిందా? అనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని చెప్పారు.
రాజకీయాల్లో ట్రెండ్ ముఖ్యం
వేదిక పెడతారా, ఫ్రంట్ పెడతారా, పార్టీ పెడతారా అని మీడియా అడగ్గా.. చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నప్పుడు అన్నీ ముందే సిద్ధం చేసుకొని, పార్టీని ప్రకటించామని గుర్తు చేశారు. ‘పాలిటిక్స్లో ఎప్పుడూ ట్రెండ్, సిచ్యువేషన్, ఈక్వేషన్ ప్రభావం చూపుతాయి. దానికి సరైన నాయకుడు తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో అప్పటి పం చాయతీ ఎన్నికలు రుజువు చేశాయి. రెండు జడ్పీలు, 100 మండలాలు, 3,000 సర్పంచులు, 1,142 ఎం పీటీసీ సీట్లలో గెలిచాం. ఇప్పుడు అలాగే ఉంటుంది. తొందర అవసరం లేదు’ అని సీఎం చెప్పారు.
పరిపూర్ణ విద్య కోసమే స్కూళ్ల రేషనలైజేషన్
స్కూళ్ల రేషనలైజేషన్ అంటే కొన్ని స్కూల్స్ మూసేస్తారని కొందరు అపోహలు కలిగిస్తున్నారని, కానీ తాము అలా చేయటం లేదని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలోనూ అన్ని సబ్జెక్టుల టీచర్లు ఉండేలా రేషనలైజ్ చేయాలని అన్నారు. కావాలంటే ఇంకో 10 వేల టీచర్ల పోస్టులు ఇస్తామని తెలిపారు.
నీళ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగం ఫైల్స్పై చర్చ జరగాలి
కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై స్పందించాలని అడగ్గా.. నీళ్లు, ఉద్యోగాలు, అభివృద్ధి, నిరుద్యోగంపై ఫైల్స్పై చర్చ జరగాలని, ఆ ఫైల్స్ను తాము దేశ ప్రజల ముందు ఉంచుతామని కేసీఆర్ చెప్పారు. కేజ్రీవాల్ వచ్చినా ఆహ్వానిస్తామని, ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రయత్నం వారు చేస్తారని అన్నారు. ఉద్యోగాల భర్తీపై స్పందిస్తూ, వాస్తవానికి ఉద్యోగాలు ఎక్కువగా ప్రైవేటు రంగంలోనే ఉంటాయని, ప్రభుత్వ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి సహజంగానే పోటీ అధికంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగ భద్రత, గౌరవం ఉంటుందని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువమంది పోటీపడతారని వెల్లడించారు.
ఈడీలు.. బోడీలకు భయపడం
కేంద్రం తమపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తుందని కొందరు భయపెడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఈడీ కాకపోతే బోడీ దాడులు చేసుకోండి. ఎవడు భయపడుతడు. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకు, పిట్ట బెదిరింపులకు కేసీఆర్ భయపడుతడా?. ఈడీలకు, బోడీలకు, సీబీఐకి భయపడేది ఉంటే 15 ఏండ్లు తెలంగాణ ఉద్యమం చేస్తమా?’ అని గద్దించారు. దొంగలు, భయంకరంగా అవినీతి చేసినోళ్లు భయపడుతరని, తాము పట్టించుకోబోమని చెప్పారు.
పీకే పేరు చెప్తే భయమెందుకు?
దేశంలో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ తమతో కలిసి పనిచేస్తున్నారని, ఇందులో తప్పేముందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సర్వే చేసి ప్రజల నాడిపట్టడంలో ఆయన సిద్ధహస్తుడని, ఇందులో రహస్యం ఏమీ లేదన్నారు. పీకే పేరు చెప్తేనే ప్రతిపక్షాలు బాంబులు పడ్డట్టు ఎందుకు ఆగమాగం చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నా రు. పైగా రూ.వందల కోట్లు బేరం కుదిరినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పీకే తనకు ఏడేండ్లుగా మంచి స్నేహితుదని, ఆయనకు డబ్బు తీసుకొని పనిచేసే అలవాటు లేదన్నారు. దేశం పట్ల ఆయన నిబద్ధత చాలా గొప్పదన్నారు. డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలున్నాయా? అని ప్రశ్నించా రు. ఆయన ఇప్పటివరకు 12 రాష్ర్టాల్లో పనిచేశాడని, జాతీయ పార్టీలకు కూడా పనిచేశారని ఎవరిదగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. యూఎన్వోలో ఉండగా అనేక దేశాలకు సైతం సలహాలిచ్చారని గుర్తు చేశారు.
ఈసారి 95-105 సీట్లు పక్కా..
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 మధ్య సీట్లు గెలువడం పక్కా అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటిసారి 63తో గెలిచామని, ఆ తర్వాత 85 సీట్లకు పెరిగాయని గుర్తు చేశారు. ఇదే తరహాలో వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 మధ్య తమకు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు 25 రోజుల తర్వాత ఒక నివేదిక ఇస్తానని, అది చూసి అందరూ ఆశ్చర్యపోతారని అన్నారు. మూడు రకాల సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా 30 స్థానాల్లో సర్వే చేశాయని, ఈ నివేదిక తనకు నిన్ననే (ఆదివారం) అందిందన్నారు. దీని ప్రకారం 30 సీట్లలో 29 టీఆర్ఎస్ గెలుస్తుందని, ఒక దగ్గర మాత్రం కేవలం 0.3 శాతంతో పోతున్నదని అన్నారు. 30లో ఒకటి చొప్పున 120 నియోజకవర్గాలకు కేవలం నాలుగు సీట్లు పోతాయని వివరించారు. రాష్ట్రంలో కచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతున్నదని తెలిపారు. అయితే కేసీఆర్ ఎక్కడుంటాడనేది కాలం నిర్ణయిస్తుందని, అవసరం ఎక్కడ ఉంటే అక్కడికి పోతానని చెప్పారు.
ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదు
ఆరునూరైనా ఈసారి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. తొలి ప్రభుత్వంలో ముందస్తుకు వెళ్లాల్సిన అవసరమున్నందున అసెంబ్లీని రద్దు చేశామని చెప్పారు. ‘మేం ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టులు మళ్లా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండె. టీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా రావాల్సిన అవసరం ఉండె. అందుకే.. సరైన సమయంలో నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్లినం. 85 సీట్లతో తిరిగి వచ్చినం. ఇప్పుడు ఆ అవసరమే లేదు’ అని వివరించారు. తాము చేపట్టిన పనులన్నీ పరిపూర్ణంగా పూర్తవుతున్నాయని చెప్పారు. తమ టర్మ్ ముగిసేదాకా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తామని, మధ్యలో భంగం చేయమని తెలిపారు. కొందరు తెలువక, తెలివి లేక చేసే వ్యా ఖ్యలకు తామేమీ చేయలేమన్నారు. కేసీఆర్ ఎప్పుడూ మోసం చేయడని, చెప్పిందే చేస్తాడని స్పష్టం చేశారు. అయితే ‘హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలా? విద్వేషాలు కావాలా?. ఉద్యోగాలు రావాలా? ఉన్నవి ఊడిపోవాలా?. పెట్టుబడులు రావాలా? బంద్ కావాలా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.