గజ్వేల్, నవంబర్ 26: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శుక్రవారం లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. గజ్వేల్లోని అంగడి హనుమాన్ ఆలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఎదుర్కోలు నిర్వహించి సంగాపూర్ మార్గంలో కార్యక్రమ వేదికపైకి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివార్ల ఉత్సవమూర్తులను తీసుకువచ్చారు. వేదికపై ప్రతిష్ఠింపజేసి వేదపండితులు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. హాజరైన భక్తులు భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించారు. ధర్మపురి తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి అనుగ్రహ భాష్యం ఇచ్చారు. పురాణం మహేశ్వరశర్మ కార్త్తిక పురాణం, శివ కేశవులు, శివ పార్వతుల కల్యాణం, కార్త్తిక దీప ప్రజ్వలన మహిమ గురించి ప్రవచనం చేశారు. మంత్రి హరీశ్రావు శివపార్వతుల ఉత్సవమూర్తుల వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం సచ్చిదానంద స్వామీ దీపం వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తితో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మనిషికి జీవితానికి ఆరోగ్యం, ఆనందం, సంతోషం, అర్థం, పరమార్థం కలుగుతాయని ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. లక్ష దీపోత్సవానికి హాజరైన ఆయన లింగాభిషేకం, దీపప్రజ్వలన చేసిన అనంతరం పురాణ పఠనం చేసిన పురాణం మహేశ్వరశర్మను సన్మానించి ప్రసంగించారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన పిల్లలందరికీ మన ధర్మాన్ని తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేసినటువంటి యాగాలు మరెవ్వరూ చేయలేదన్నారు. యాదాద్రి ఆలయం లాంటి నిర్మాణం మరెవ్వరూ చేయలేదన్నారు. త్వరలో యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించుకోబోతున్నామని, ఆలయ బంగారు తాపడానికి గజ్వేల్ పట్టణ వాసులు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కలిసి కిలోబంగారాన్ని ఇస్తున్నట్లు తెలియజేశారని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గజ్వేల్ ప్రజలు, ముఖ్యంగా ఆర్యవైశ్యులంతా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుడడం సంతోషంగా ఉందన్నారు.
హాజరైన ప్రముఖులు..
గజ్వేల్ పట్టణ వేద పండితులు, దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవానికి మంత్రి హరీశ్రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కమిషనర్ వెంకటగోపాల్, పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవంలో భాగంగా శనివారం అజయ్ధీర సింహ ఆచార్యులచే లక్ష్మీశ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు కీసర శ్రీసాయి దత్త పీఠాధిపతి స్వామి రామానంద ప్రభూజీ హాజరు కానున్నారు. శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బ్రహ్మశ్రీ బాదంపల్లి సంతోష్కుమార్ శాస్త్రిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారు.
రేపటి కార్యక్రమాలు..
లక్ష దీపోత్సవం మూడో రోజు ఆదివారం గజ్వేల్ పురోహితులచే సీతారామ చంద్ర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు నాచారం గుట్టలోని శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామిహాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నారు. వేంకటేశ్వర భక్తిఛానల్ వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖరశర్మ గారిచే ప్రవచనం ఇవ్వనున్నారు.
పాపాల దహనం
శ్రావణ మాసం విష్ణువుకు, మార్గశిర మాసం శివునికి ఇష్టమైతే ఇరువురికి ఇష్టమైనది కార్త్తిక మాసమని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. దీపోత్సవంలో భాగంగా పురాణం మహేశ్వరశర్మ శివ పార్వతుల కల్యాణం, కార్తీక మాస విశిష్టత, దీప ప్రజ్వలన గురించి భక్తులుకు తెలియజేశారు. దీప ప్రజ్వలనతో పాపాలు దహింపబడతాయన్నారు.
కలియుగంలో భగవన్నామసర్మణతో భుక్తి, ముక్తి
గజ్వేల్ ప్రాంత వాసులు అన్నా, ఇక్కడి ప్రజలు, శిష్యులు అన్నా శృంగేరీ భారతీ తీర్థ స్వాముల వారికి ఎంతో ప్రీతి అని, కలియుగంలో భగవన్నామ సర్మణతో భుక్తి, ముక్తి పొందగలుగుతామని ధర్మపురి తుని తపోవనాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి అన్నారు. కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఆయన అనుగ్రహభాష్యం ఇచ్చారు. శృంగేరీ పీఠానికి గజ్వేల్ ప్రాంత వాసులకు చక్కని బంధం ఉందన్నారు.