కీసర, నవంబర్ 19: శివ నామ స్మరణతో శుక్రవారం మహా నగరంతో పాటు కీసరగుట్ట పరిధులు మార్మోగాయి. కార్తిక పౌర్ణమి, శుక్రవారం కావడంతో కీసరగుట్ట శివాలయం భక్తుల శోభతో కళకళలాడింది. తెల్లవారుజాము 3.30 గంటల నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి మాహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. రాజగోపురం ముందున్న శివ లింగాలకు పాలు, తేనె, నెయ్యిలతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించుకున్నారు. చాలా మంది భక్తులు కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కీసరగుట్టకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ, ఆలయ కార్య నిర్వహణాధికారి కట్టా సుధాకర్ రెడ్డి, వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. మంత్రి ధ్వజ స్తంభం వద్ద కార్తిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.