న్యూఢిల్లీ: నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షపై దక్షిణాది రాష్ర్టాలు కన్నెర్ర చేశాయి. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలో కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన డీఎంకే విడివిడిగా నిరసనలు వ్యక్తం చేశాయి. నిధుల విడుదలలో చూపుతున్న నిర్లక్ష్యం, పక్షపాత వైఖరిని అవి ఎండగట్టాయి. వారికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్ము-కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఇతర నేతలు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు ఎల్డీఎఫ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉదయమే చలిలో కేరళ హౌస్ నుంచి జంతర్మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
స్వతంత్ర దేశ చరిత్రలో 2024 ఫిబ్రవరి 8ని ‘రెడ్ లెటర్ డే’గా లిఖించదగిన రోజని సీఎం విజయన్ విమర్శించారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పరిగణించే ప్రజాస్వామ్యం నెమ్మదిగా, క్రమంగా యూనియన్ ఓవర్ స్టేట్స్గా కుంటుపడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉత్తర, దక్షిణ తేడాలు చూపిస్తూ వివక్ష ప్రదర్శిస్తున్నదని, కానీ కేరళ, తమిళనాడు నేతలతో కేజ్రీవాల్, పంజాబ్ సీఎం, భగవంత్ మాన్ లాంటి వారు కలవడం చూస్తేంటే వారికలాంటి భేద భావాలేవీ లేవని అర్థమవుతుందని సీతారాం ఏచూరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టాలను మున్సిపాల్టీలుగా భావిస్తున్నారని, అందుకే వాటికి అధికారాలు ఇవ్వకుండా చేస్తున్నారని, అందుకే అవి వీధెక్కి పోరాటాలు చేయాల్సి వస్తున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జంతర్మంతర్ సభలో విమర్శించారు. కేంద్రం వైఖరికి నిరసనగా డీఎంకే, దాని సంకీర్ణ పార్టీల ఎంపీలు గురువారం నల్ల చొక్కాలు ధరించి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలతో కేంద్రం యుద్ధం చేస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేశంలో 70 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు.