గంగాధర, నవంబర్ 29: నియోజకవర్గంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లిలో మంగళవారం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై తహసీల్దార్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయడానికి అధికారులు సర్వే చేపట్టి, అర్హుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. సర్వే చేస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్న ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరులో పైరవీలకు తావు లేదని, లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పాదదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయగా, గృహప్రవేశం చేసినట్లు తెలిపారు. చొప్పదండి, ఆర్నకొండలో సంక్రాతి తర్వాత లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గంగాధర, బోయినపల్లి, రామడుగు మండలాల్లో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని గుర్తించి, త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. గతంలో డబుల్ బెడ్రూంలు మంజూరైన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో గంగాధర, చొప్పదండి, బోయినిపల్లి తహసీల్దార్లు పాల్గొన్నారు.