తిమ్మాపూర్ రూరల్/మానకొండూర్ రూరల్, జనవరి 8: ప్రేమించిన వాడే ఆ యువతి పాలిట కాల యముడయ్యాడు. ఈ నెల 1న యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడు.. ఆమెపై లైంగిక దాడిచేసి, ఆపై అంతంచేశాడు. శనివారం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్ మండలంలోని పోరండ్లకు చెందిన అసోద అఖిల్, మన్నెంపల్లికి చెందిన ఆరెల్లి వరలక్ష్మి (19) ఇంటర్ నుంచి ప్రేమించుకొంటున్నారు. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. గ్రామ పెద్దల సమక్షంలో ఏడాది క్రితం పంచాయితీ కూడా జరిగింది. అప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. వరలక్ష్మి మేకలను పెంచుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నది. ఎప్పటిలాగే ఈ నెల 1న వరలక్ష్మి పోరండ్ల శివారులోకి మేకలను మేతకు తీసుకెళ్లింది. ఆ సమయంలో మరో యువకుడితో వచ్చిన అఖిల్ ఆమెను బెదిరించి బైక్పై తీసుకెళ్లినట్టు గ్రామస్థులు చెప్తున్నారు. ఈ నెల 5న కుటుంబీకులు ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎస్సై ప్రమోద్రెడ్డి అఖిల్ను అదుపులోకి తీసుకొని విచారించారు. లైంగికదాడి చేసి, హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకొన్నాడు. మానకొండూర్ మండలం చెంజర్ల గుట్టపైన ఉన్న మృతదేహం వద్దకు శనివారం ఉదయం తీసుకెళ్లాడు. వరలక్ష్మిని పెండ్లి చేసుకోవాల్సి వస్తుందన్న కారణంతోనే ఆమెను హత్యచేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
మన్నెంపల్లికి చెందిన బోయిని రాజవ్వ పెళ్లిచేసుకోకుండా ఒంటరిగా ఉండేది. ఈమె సోదరి ఆరెల్లి పోశవ్వ భర్త మరణించడంతో ఆమె కూడా మన్నెంపల్లిలోనే ఉంటున్నది. ఈ క్రమంలో అనాథశ్రమం నుం చి వరలక్ష్మిని చిన్ననాడే తెచ్చుకొని ఇద్దరు తల్లులు అల్లారుముద్దుగా పెంచుకొంటున్నారు. ఇంటర్ వరకు చదివించారు. బిడ్డ మృతి విషయం తెలుసుకొని తల్లులిద్దరు భోరున విలపించారు. లా అండ్ ఆర్డర్ అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
వరలక్ష్మి హత్య ఘటనలో నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నదని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.