యాదాద్రి, జనవరి 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి పెద్దపీట వేసి పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. దీంతో యాదాద్రి పుణ్యక్షేత్రం అద్భుత శిల్పకళా క్షేత్రంగా రూపుదిద్దుకున్నది. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న యాదరుషి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతుండగా, అందుకు అనుగుణంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దాదాపు ప్రధానాలయం పనులు పూర్తి కాగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి.
యాలీ పిల్లర్ల సోయగం..
ఆలయంలోని ద్వితీయ ప్రాకారంలోని వెలుపల భాగంలో గల మండపాలకు యాలీ(సింహరూప) పిల్లర్ల సోయగం భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఆలయ ముఖ మండపాల్లో మొత్తం 58 యాలీ పిల్లర్లు నిర్మించారు. పిల్లర్లన్నీ ఒకేలా ఉండేలా చెన్నైతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన సీనియర్ శిల్పు లు శ్రమించారు. 14 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ పిల్లర్లను ఒకే శిలపై చెక్కారు. ఇందులో 80 శాతం ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డలో చెక్కగా, యాదాద్రి ఆలయంలో మిగతా 20శాతం పనులు చేపట్టి శిల్పులు చక్కటి రూపాన్ని ఇచ్చారు. ఈ కాలంలో 58 పిల్లర్లు నిర్మిం చి ఒకే రాతిశిలతో మండపాన్ని నిర్మించడం దేశంలో ప్రథమం. యాలీ పిల్లర్లలో ప్రహ్లాద చరిత్ర, నరసింహస్వామి అవతారాలతోపాటు వైష్ణవ సంప్రదాయం ఉట్టిపడే విగ్రహాలను అమర్చారు. ప్రతి యాలీ పిల్లర్ కింద ప్రత్యేకమైన సింహా విగ్రహాలను చెక్కా రు. ఏకశిలతో చెక్కిన ఈ సింహం నోటిలో గుండ్రటి బంతి ఉంటుంది. చేతితో బంతిని తిప్పితే తిరిగేలా చెక్కడం కేవలం యాదాద్రిలో చేపట్టడం విశేషం.
సీఎం కేసీఆర్ దార్శనికత.. దక్షత..
యాదాద్రీశుడి ఆలయం పూర్తిగా కృష్ణశిలరాతితోనే నిర్మించడం విశేషం. వెయ్యేండ్ల వరకు చెక్కు చెదరకుండా దూరదృష్టితో నిర్మిస్తున్న యాదాద్రి దివ్యక్షేత్ర నిర్మాణం వెనుక సీఎం కేసీఆర్ దార్శనికత, దక్షత దాగున్నవి. స్వతంత్ర భారతచరిత్రలో మొదటిసారిగా పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్న అతిపెద్ద దేవాలయం యాదాద్రి. ఈ నిర్మాణంపై త్రిదండి చినజీయర్స్వామి, తొగుట పీఠాధిపతి మాధవనంద శర్మ సంతృప్తిని వ్యక్తం చేశారు. 2014 అక్టోబర్ 17న యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విశ్వఖ్యాతి కాంచేలా అభివృద్ధి పరుస్తానని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 2015 మార్చి 5 తేదీన యాదాద్రిగా నామకరణం చేశారు. ప్రధానాలయం తూర్పు రాజగోపురం వద్ద 2015లోని దసరా రోజున సీఎం కేసీఆర్ చేతులమీదుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పన జరిగింది. విమానం గోపురం, గర్భాలయ పనులకు స్థపతి సలహాదారు వేలు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, సుందరరాజన్తో వాస్తు సిద్ధాంతం, శాస్త్రపరంగా ప్లాన్ వేయగా, త్రిదండి చినజీయర్స్వామి ఆమోదం తెలిపారు. 1500 ఏండ్ల కిందట తమిళనాడులో తంజావూరు ఆలయంలోని విమానం మాత్రమే ఎరుపురాయితో నిర్మించారు. దేశంలోని ఆలయాలు ఎరుపురాయితో నిర్మించారే తప్పా, నల్లరాతి శిల్పాలతో నిర్మించలేదు.
ప్రత్యేక కమిటీలు..
యాదాద్రిలాంటి దేవాలయాన్ని నిర్మించాలంటే రెండుమూడు తరాలు శ్రమించాల్సిందే. కానీ ఐదేండ్లలోనే ఆలయ పునర్నిర్మాణాన్ని పూర్తి చేశారంటే సీఎం కేసీఆర్ సంకల్పశుద్ధి ఎంత గొప్పదో ఇట్టే అర్థమతువుతుంది.వైటీడీఏ వైస్ చైర్మన కిషన్రావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. టెక్నికల్ కమిటీ, జియో టెక్నికల్ కమిటీ, శిల్పకళ పరిశీలన, పనుల పర్యవేక్షణ కమిటీ, సమీక్ష కమిటీ, రాయి నిర్ధారణ కమిటీ, భూసేకరణ కమిటీలు వేసి రాష్ట్ర ఇంజినీర్లు, స్థపతులు, ఆర్ట్ డైరెక్టర్లు, వివిధ నిష్ణాతులైన శిల్పులు, ఇంజినీర్ ఇన్ చీఫ్, హెచ్ఎండీఏ రిటైర్డు ఉద్యోగులను భాగస్వాములను చేశారు. యాదాద్రి ఆలయ శిల్పకళ, దేవాలయాల నిర్మాణాల్లో స్థపతులు, ఆర్ట్ డైరెక్టర్, శిల్పులు, ఉప స్థపతులు అహోరాత్రులు శ్రమించారు. యాదాద్రి నిర్మాణాల్లో రఘునాథపాత్రో, ముత్తయ్య స్థపతి, సౌందర్రాజన్ వంటి నిష్ణాతులు పాల్గొన్నారు. ఆలయ స్థపతులు, ఆర్ట్ డైరెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్ దేశవ్యాప్తంగా సంచరించి ఆయా ఆలయాల శిల్ప రీతులను పరిశీలించారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి 800 మంది శిల్పులు యాదా ద్రి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
ఎకరం స్థలంలో శివాలయం..
యాదాద్రి క్షేత్రం మొదటి నుంచి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల్లో సుమారు 50 శాతం మంది కొండపైన గల శివాలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ప్రధానాలయాన్నీ పునర్నిర్మించే క్రమంలో శివాలయాన్ని కూడా విశాలంగా విస్తరించారు.
మకుటాయమానంగా సప్త రాజగోపురాలు
ఆలయానికి మకుటాయమానంగా సప్త రాజగోపురాలు నిలుస్తున్నాయి. ఏడంతస్తుల రాజగోపురం, నాలుగు పంచతల రాజగోపురం, త్రితల రాజగోపురం, విమానం పనులు పూర్తికాగా, నలుదిక్కులా తమ రాజసాన్ని ప్రదర్శిస్తూ హుందాగా కనువిందు చేస్తున్నాయి. ఈ రాజగోపురాలు యాదాద్రికే సింబల్గా మారనున్నాయి. ఒకే రకం కృష్ణశిలతో నిర్మించిన ఏకైక సప్తతల రాజగోపురం ప్రపంచంలోనే ప్రథమంగా యాదాద్రిలో నిర్మించడం ఒక ప్రత్యేకత అని స్థపతులు చెబుతున్నారు. ప్రధానాలయంపై 48 అడుగుల ఎత్తులో విమానం, ఆలయం చుట్టూ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ భాగంలో 55 అడుగుల ఎత్తులో నాలుగు పంచతల రాజగోపురాలు నిర్మించారు. సప్తతల రాజగోపురం సుమారు 85 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఆలయంలోకి వెళ్లేందుకు ఈశాన్యంలో సంప్రదాయంగా త్రితల రాజగోపురం 40 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఒక్కో గోపురానికి ద్వారపాలకులు, వైష్ణవమూర్తుల విగ్రహాలను బిగింపుతో గోపురాలను భక్తులను ఆకట్టుకోనున్నాయి. పంచతల రాజగోపురానికి 40 విగ్రహాలు, సప్తతల రాజగోపురానికి 54 ద్వారపాలకు లు, వైష్ణవమూర్తుల విగ్రహాలను అమర్చారు.
ఆకర్షణీయంగా క్యూ లైన్లు…
ప్రధానాలయం ముందు తూర్పు రాజగోపురం ముందుగా ఉన్న ప్రహరీ పక్కన క్యూలెన్లు బిగించారు. భక్తిభావం ఉట్టిపడే విధంగా క్యూలైన్లకు శంకు, చక్ర, నామాలు, ఐరావతాలు, దేవతామూర్తుల రూపాలను పొందుపర్చారు. ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని విధంగా బంగారు వర్ణంలో ఉండే అల్యూమినియం వాడకం ఎక్కడాలేదని ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి తెలిపారు. యాదాద్రి మాఢవీధుల్లో నుంచి బ్రహ్మోత్సవ మండపం పక్క నుంచి స్వామివారి ముఖ మండపం వద్దకు 301 ఫీట్ల పొడవు, వెడల్పు 8-6 ఫీట్లు, 10- 12 ఫీట్ల ఎత్తులో క్యూలైన్లు బిగించారు.
ప్రథమ ప్రాకారం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ప్రథమ ప్రాకారం వెలుపల శిల్పశాస్త్రం ప్రకారంగా గోడలలో కుంభపంజరం, కిటికీలు, లతలు, పుష్పాలు మొదలుకొని అందంగా శిల్పాలు చెక్కడం భక్తులను కనువిందు చేస్తున్నాయి. ప్రాకారానికి నాలుగువైపులా నాలుగు ద్వారాలను ఏర్పాటు చేశారు. ఇందులో సంప్రదాయ సిద్ధంగా ఈశాన్యం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. గతంలో ఉన్న విధంగానే మూడంస్తుల రాజగోపురం నిర్మించారు. ఈ రాజగోపురం ద్వారా భక్తులు లోపలికి వెళ్లి ఆంజనేయస్వామి దర్శనం, ధ్వజస్తంభం నుంచి నేరుగా గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి గోదాదేవి దర్శనం చేసుకుని భక్తులు పడమర వైపుకు వెళ్లేవిధంగా నిర్మాణం జరిగింది. పడమర దిశలో ఐదంస్తుతల రాజగోపురం నిర్మించారు. ఈ రాజగోపురానికి ముందు విజయ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలోని ప్రథమ ప్రాకారం పైభాగంలో సాలాహారాలను నిర్మించారు. దశవతారం, నరసింహస్వామి అవతారం, వైష్ణవమూర్తులు వంటి వివిధ రకాల విగ్రహాల నిర్మాణం భక్తులను ఆకట్టుకునే విధంగా నిర్మించారు.
ద్వితీయ ప్రాకారం..
ప్రధానాలయంలో ప్రథమ ప్రాకారం అనంతరం మరో ద్వితీయ ప్రాకారం నిర్మించారు. ప్రాకారం లోపల సింహస్థంభాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ మండపాలను అమర్చారు. వెలుపల భాగంలో బాలపాద స్తంభాలు, అష్టభుజి ప్రాకారాలు తయా రు చేశారు. వాటికి నాలుగువైపుల నాలుగు రాజగోపురాలు ఏర్పాటు చేశారు. తూర్పు, ఉత్తరం, దక్షిణం ఐదంతస్తుల రాజగోపురం, పడమర 7 అంతస్తుల రాజగోపురం నిర్మించారు. శిల్పశాస్త్రం ప్రకారంగా నలుదిక్కులా నాలుగు రాజగోపురాలు, రాజువారికి ఎదురుగా సప్తతల రాజగోపురాల నిర్మాణం చేపట్టారు. ఈ రాజగోపురం సైతం కృష్ణశిలలతో ఎంతో అందంగా, భక్తుల కనువిందుగా ఏర్పాటు చేశారు. ప్రతి గోపురంపైన కేశవమూర్తులు, వైష్ణవమూర్తులు గా చెక్కారు.
నలుదిశలా నాలుగు మండపాలు..
యాదాద్రిశుడి ఆలయంలో నలుదిశలా నాలుగు మండపాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ద్వితీయ ప్రాకారం వెలుపల భాగంలో అద్దాల మండపం, రామానుజకూటం, యాగశాల, కల్యాణ మండపం శాస్త్రపరంగా నిర్మించారు. ప్రపంచ దేవాలయాల్లో ఎక్కడాలేని విధంగా నాలుగు దిక్కులా నాలుగు మండపాలను నిర్మించడం విశేషం. ప్రతి పిల్లరుకు సంపూర్ణ రామాయణ ఘట్టాలను తీర్చిదిద్దారు. ద్వితీయ ప్రాకారంలోని స్వామివారికి వాయు దిశలో స్వామివారి అద్దాల మండపాన్ని నిర్మించారు. అద్దాల మండపంలోని ఊయలలో నరసింహస్వామి, లక్ష్మీఅమ్మవారు అందులో నుంచి శయనోత్సవం నిర్వహిస్తారు. ద్వితీయ ప్రాకారంలోని స్వామివారికి నైరుతి దిశలో ప్రత్యేకించి యాగశాలను నిర్మించారు. మండపంలోని ప్రతి పిల్లరుకు ప్రత్యేకమైన ప్రతిమలతో తీర్చిదిద్దారు.
గురిజెపల్లి కృష్ణశిల..
నాణ్యమైన శిలలతో నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో కృష్ణశిల నిర్ధారణ కమిటీని వేశారు. ఇందులో సభ్యులుగా స్థపతి సలహాదారు డాక్టర్ వేలు, శిల్పి హరిప్రసాద్, వైటీడీఏ కన్సల్టెంట్ ఇంజినీర్ రాఘవేంద్రరావు ఉన్నారు. వీరు రాష్ట్రమంతటా పర్యటించి నాణ్యమైన కృష్ణశిలలను గుర్తించారు. మొదటగా కరీంనగర్, బ్రాహ్మణపల్లి, గురిజెపల్లిలో గుర్తించగా, ఏపీలోని ప్రకాశం జిల్లాలోని గురిజెపల్లిలో నాణ్యమైన కృష్ణశిలలను ఎంపిక చేశారు. క్వారీల్లోని రాళ్ల నాణ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ సంస్థ పరీక్షించింది. రాతితో చెక్కిన శిల్పాల నాణ్యతను మెస్సర్స్ సీవెల్ ఇంజినీర్స్ సంస్థ పరిశీలించింది. మొత్తం దాదాపు 2.5 లక్షల టన్నుల కృష్ణశిలలను వినియోగించి ఆలయాన్ని నిర్మించారు. కృష్ణశిలలు ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం.. వేసవి కాలంలో మరీ వేడిగా ఉండకుండా, చలికాలంలో మరీ చల్లగా ఉండకుండా సమతుల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుం ది. ఒకే క్వారీ నుంచి రాయిని తీసుకోవడం గతంలో ఎన్నడూ లేదని స్థపతులు తెలిపారు.
గానుగ సున్నం, కారక్కాయ, బెల్లం మిశ్రమం..
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ప్రాచీనకాలంలో చేపట్టిన నిర్మాణాల్లో వాడిన గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంధ, జనప నార గుజ్జు మిశ్రమాన్ని ఉపయోగించారు. ఈ మిశ్రమాన్ని బెంగళూరులోని బ్యూరో వెర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరీక్షించి సర్టిఫై చేసి, ఐఎస్ కోడ్లకు అనుగుణంగా వీటి పరీక్షలు నిర్వహించారు. పెద్ద పెద్ద జాయింట్ల వద్ద సీసాన్ని కూడా వాడారు.
అష్టభుజి మండపం..
ఆలయ చుట్టూ అష్టభుజి మండపం రమణీయ శిల్పాలతో రూపుదిద్దుకున్నాయి. అష్టభుజి మండపాలు సుమారు 200 వరకు ఉన్నాయి. ఈ మండపాలు యాదాద్రి నిర్మాణానికే వన్నె తెచ్చి పెడుతున్నాయి. ఇవి తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లోని ప్రఖ్యాత ఆలయాల్లో మాత్రమే ఉన్నాయి.
బ్రహ్మోత్సవ మండపం..
తూర్పు ఆగ్నేయ దిశలో బ్రహ్మోత్సవ మండపం నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి అలంకరణ చేసి భక్తులు కనువిందు చేసేలా మండపాన్ని నిర్మించారు.
వేంచేపు మండపం..
స్వామివారి అభిముఖంగా వేంచేపు మండపం నిర్మించారు. ఈ మండపంలో సుమారు 25 అడుగుల ఎత్తులో నిర్మించారు. తిరుమలలో గొల్లమండపం ఎలా ఉందో అదే స్థాయిలో ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
4.30ఎకరాల్లో యాదాద్రి ఆలయ నిర్మాణాలు..
17.32 ఎకరాల్లో యాదాద్రి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇందులో 4.30ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించారు. గతంలో కేవలం 1.30ఎకరాల్లో ఉన్న యాదాద్రీశుడి ఆలయం ప్రస్తుతం 4.30 ఎకరాలు వరకు పెరిగింది. ఆలయం చుట్టూ గోడను నిర్మాణం చేపట్టారు. పడమర దిశలో 125 మీటర్ల పొడవు, 50 ఫీట్ల ఎత్తు, దక్షిణ భాగంలో 215 మీటర్ల పొడవు, 100ఫీట్ల ఎత్తు, ఉత్తర భాగంలో 215 మీటర్ల పొడవు, 20ఫీట్ల ఎత్తుతో ప్రహరీని నిర్మిస్తుండగా పను లు కొనసాగుతున్నాయి. ఉత్తర భాగంలో గల ప్రహరీ పక్కనే 330 పొడవు, 43 వెడల్పులో గార్డెన్ నిర్మించి, పూల మొక్కలు, పచ్చని గడ్డి నాటారు.
వెయ్యేండ్లు గుర్తిండిపోయే ఆకృతులు..
ప్రధానాలయంలో ప్రథమ, ద్వితీయ ప్రాకారాలలోని సాలాహారాలకు దాదాపు 240 దేవతామూర్తులు, దశావతారాలు, వివిధ అవతారాల అమ్మవారి విగ్రహాలను అమర్చారు. ద్వితీయ ప్రాకారంలోని బయటి ప్రాకారంలో నిర్మించి అష్టభుజి మండపాలకు గల పిల్లర్లకు వివిధ రకాల దేవతామూర్తులు, దశావతరాలు, అమ్మవారు, విగ్రహాలతో పాటు తెలంగాణ సాంస్కృతి, వివిధ రకాల నాణే లు, తెలంగాణ పండుగ, సంప్రదాయాలను గుర్తిస్తూ చక్కటి ఆకారాలను చెక్కారు. ఈ కాలంలో వాడిన నాణేలు, కరెన్సీలను మరో వెయ్యేండ్లు గుర్తిండిపోయేలా పిల్లర్లలో భద్రపరిచారు. అష్టభుజి మండపాలలో నిర్మించిన 158 పిల్లర్లకు వివిధ రకాల చక్కటి ఆకృతులను భక్తులను ఆకట్టుకోనున్నాయి.
నిలువెత్తు ఆళ్వారులు..
యాదాద్రి ఆలయ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగానే యాదాద్రి ఆలయం వైష్ణవాగమశాస్త్రం, పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. గర్భాలయంలో ముందులో 150×100 అడుగులు మహా ముఖమండపం కృష్ణశిలలతో 12 మంది వైష్ణవ మతప్రచారకులైన ఆళ్వారులను ఒక్కొక్క పిల్లరుకు సుమారు 40 టన్నుల రాళ్లతో చెక్కారు. దేవతలకాలం నుంచి వైష్ణవ సంప్రదాయానికి ప్రచారకులుగా ఉంటూ వస్తున్న ఆళ్వారులను యాదాద్రి ప్రధానాలయంలో గొప్ప గౌరవాన్ని ఇస్తూ భారీ విగ్రహాలను అమర్చారు. మహామండపానికి 18 అడుగుల ఎత్తులో గల 12 పిల్లర్లకు 10 అడుగుల వివిధ రకాల ఆళ్వార్ల విగ్రహాలు భక్తులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాత్రం నిలువెత్తు రూపంలో ఆళ్వార్లు విగ్రహాలను నిర్మించేందుకు స్థపతులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తరతరాలకు వైష్ణవ మతప్రచారకులైన ఆళ్వార్ల చరిత్ర నిలిచిపోయేలా నిర్మాణాలు జరిగాయి.
గర్భాలయం..
గతంలో స్వామివారి గర్భాలయం మూడంతస్తులు మాత్రమే ఉండేది. ప్రస్తుతం సుమారు 45 అడుగుల ఎత్తులో 5 అంతస్తుల విమానం నిర్మించారు. గోదాదేవి(ఆండాళ్ అమ్మవారు), రామానుజం, ఆళ్వార్, శైన మండపం ఉపాలయాలతోపాటు శరణాలయం నిర్మాణం పూర్తయింది. వీటన్నింటికీ ఒక అంతస్తు కలిగిన విమానం నిర్మాణం చేశారు. గతంలో ఏ స్థానంలో ఉన్నాడో క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఏకతల విమానం నిర్మించి, స్వామివారి నెలకొల్పి చుట్టూ రాతితో గర్భాలయాన్ని ఏర్పాటు చేశారు. యాదాద్రి గర్భాలయం ముఖద్వారంపై పంచలోహంతో తయారు చేసిన ప్రహ్లాదుడి చరిత్ర భక్తులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భక్త ప్రహ్లాదుడి చరిత్ర, నరసింహస్వామి అవతారాన్ని తెలుపుతూ 10 ఫ్యానల్ను గర్భాలయ ముఖ ద్వారంపై అమర్చారు. హిరణ్యాక్షుడి రాజ్యసభను, 9 అడుగుల ఎత్తు, 70 అడుగుల వెడల్పుతో రూపొందించిన ప్రతిమలను అమర్చారు. పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రిలో స్వామివారి పంచవతారాలను శిల్పులు ప్రధాన గర్భగుడికి చెక్కారు. లక్ష్మీనరసింహుడి అవతారం, ఉగ్ర నరసింహుడు, గండబెరుండ నరసింహ, యోగానంద నరసింహ, జ్వాల నరసింహ అవతారాలను వరుసగా తీర్చిదిద్దారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు స్వామివారి పంచావతారాలు ఆకర్షించనున్నాయి.