ఆర్మూర్, జనవరి 18 : ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇందూరుకు పట్టిన దరిద్రమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టేబాజ్, బక్వాజ్, బడా జూఠా అయిన అర్వింద్ పుట్టిన తరువాతనే అబద్ధం పుట్టిందన్నారు. పచ్చి అబద్ధాల కోరు అని, డ్రగ్ అడిక్ట్ అండ్ సైకో అని మండిపడ్డారు. ఆయనదంతా నేర చరిత్ర..ఆయన కుటుంబానిది ఘోర చరిత్ర అని విమర్శించారు. మాక్లూర్ మండలంలో జర్నలిస్ట్పై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవాలని పోలీసు అధికారులకు చెప్పినట్లు తెలిపారు.
కరోనా పాజిటివ్ వచ్చిన కారణంగా హోం ఐసొలేషన్లో ఉంటున్న జీవన్రెడ్డి రెండు రోజులుగా అర్వింద్, బీజేపీ నాయకులు తనపై చేస్తున్న దుష్ప్రచారంపై మంగళవారం ఫేస్బుక్ లైవ్లో వివరణ ఇచ్చారు. ఎంపీ అర్వింద్, బీజేపీ మూక చిల్లర రాజకీయాలు చేస్తూ తన మీద బురద జల్లేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. జర్నలిస్టులు బీజేపీ ట్రాప్లో పడొద్దని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లానని, 15వ తేదీ రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హోం ఐసొలేషన్లో ఉంటున్నానని చెప్పారు.
తాను లేని సమయంలో తనకెలాంటి సంబంధం లేకుండా జరిగిన జర్నలిస్ట్పై దాడి ఘటనను తనకు ఆపాదించడానికి అర్వింద్ కుట్ర చేయడం సిగ్గు చేటన్నారు. 20 ఏండ్లుగా తెలంగాణ ఉద్యమం, రాజకీయాల్లో జర్నలిస్టులతో కలిసి పని చేస్తున్నానని పేర్కొన్నారు. మీడియా ఫ్రెండ్లీ ఎమ్మెల్యేనని, ఇప్పటికీ మూడు వేల టీవీ చర్చల్లో పాల్గొన్నానని తెలిపారు. ప్రతిరోజు టీవీ చర్చలు, ప్రెస్మీట్లు, సోషల్ మీడియాల్లో ఉంటానని, అలాంటి తాను ఒక జర్నలిస్టుపై ఎందుకు దాడి చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జర్నలిస్ట్పై తుపాకీ ఎక్కుపెట్టి దాడి చేసిన చరిత్ర అర్వింద్కే ఉందన్నారు. అతడొక నేర చరితుడని, అనేక కేసులున్నాయని తెలిపారు. కొన్నేండ్లుగా దుబాయ్ వెళ్లలేడని, పోతే కేసులు పెడుతారని అర్వింద్ తనపై తప్పుడు ప్రచారం చేశాడని అన్నారు. తాను దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి లైవ్లో సవాల్ చేస్తే అర్వింద్ తోక ముడిచాడన్నారు.
అప్పటి నుంచి ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ (ఎఫ్-3) ఎంపీ అర్వింద్ అని పిలుస్తున్నామన్నారు. అయినా వ్యక్తిత్వం మార్చుకోకుండా బరి తెగించి అబద్ధాలు చెబుతున్నాడన్నారు. అందుకే బట్టేబాజ్, బక్వాజ్, బడాజూఠా (బీ-3) ఎంపీ అనాల్సి వస్తున్నదని తెలిపారు. తండ్రీ కొడుకులు తలో పార్టీలో ఉన్నారని, ఒకే ఇంట్లో మూడు కుంపట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. అర్వింద్ ముందు తన ఇల్లు చక్కబెట్టుకుని ఇతరుల గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే సూచించారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని ఈ అబద్ధాల కోరును, పసుపు బోర్డు తేకుండా మోసం చేసిన ఆయనను నిజామాబాద్ జిల్లా ప్రజలు నమ్మరన్నారు. తనకు కరోనా తగ్గాక దాడికి గురైన జర్నలిస్టును కలిసి పరామర్శిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.