శ్రీశైలం : శ్రీగిరులపై కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లవన్న పాల్గొని మాట్లాడారు. ఫాల్గుణ మాసంలో జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వలన శివకటాక్షం లభిస్తుందని అన్నారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదురుగా గంగాధర మండపం వద్ద శాస్ర్తోక్త పూజలు నిర్వహించిన అనంతరం కామదహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోపాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మన్మధుడు శివుడి తపస్సును భగ్నం చేయగా.. ఆగ్రహించిన పరమేశ్వరుడు మన్మధుడిని దహించింది ఫాల్గుణ చతుర్థశి రోజునేనని పురాణాలు చెబుతున్నాయని వేదపండితులు తెలిపారు. గడ్డితో చేసిన మన్మధ రూపాన్ని దహించే ఘటాన్ని తిలకించిన భక్తులు.. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు వేదపండితులు పాల్గొన్నారు.