హైదరాబాద్, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ): కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను రెండు కాంపోనెంట్లుగా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు మొత్తాన్ని ఒకే కాంపోనెంట్గా గుర్తించాలని, రెండో కాంపోనెంట్ను తొలగించాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖల ఈఎన్సీ మురళీధర్ ఆదివారం లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును 2.5 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచినప్పటికీ ఆ మేరకు నీటి కేటాయింపులు చేయలేదని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో పెంచిన ఆయకట్టుకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేసినట్టు తెలిపారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల వద్ద నీటిని తీసుకొనేవిధంగా 2006లోనే బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఉమ్మడి ఏపీ సర్కారు నివేదించిందని, డీపీఆర్ కూడా అందజేసిందని పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులైన జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, హెచ్ఎన్ఎస్ఎస్, టీజీపీ ప్రాజెక్టులకు శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్ 885 అడుగుల వద్ద నుంచి నీటిని తీసుకొనేవిధంగా డిజైన్ చేయడంతోపాటు, ఆ రిపోర్టులను కూడా బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు నివేదించిందని తెలిపారు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద, ఏపీ ప్రాజెక్టులను బేసిన్ అవతల ఉన్నందున 885 అడుగుల వద్ద నీటిని తీసుకొనేవిధంగా డిజైన్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా అదే కారణంతో 800 అడుగుల వద్ద తెలంగాణ ప్రభుత్వం డిజైన్ చేసిందని వివరించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం విచారణ కొనసాగిస్తున్న ట్రిబ్యునల్-2 ఎదుట సైతం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు 75 శాతం విశ్వసనీయత గల నికర జలాలను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఏపీ ప్రభుత్వం తమ ప్రాజెక్టులకు మిగులు జలాలను కేటాయించాలని మాత్రమే కోరిందని ఈఎన్సీ మురళీధర్ వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సవరించాలని, ఆ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు.