హైదరాబాద్, జనవరి 24 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొక్కవోని జలసంకల్పానికి, దీక్షా దక్షతకు కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. అందుకు కేంద్ర విద్యుత్తుశాఖ పరిధిలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ప్రకటించిన ఏ-గ్రేడే నిలువెత్తు సాక్ష్యమని తెలిపారు. ఆ సర్టిఫికెట్ ప్రకటనతో ఇన్నేండ్లుగా ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ అర్ధరహితమని తేలిపోయిందని అన్నారు. సోమవారం ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. కాళేశ్వరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాగు ప్రాజెక్టులపై పెడుతున్న ప్రతి పైసా సద్వినియోగమవుతున్నదని చెప్పడానికి ఏ-గ్రేడ్ ఒక ఉదాహరణ అని చెప్పారు. రుణాల చెల్లింపు సక్రమంగా సాగుతున్నదంటూ కేంద్ర సర్కారే కితాబిచ్చిందని వెల్లడించారు. ప్రాజెక్టులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్న వారికి ఈ సంతకం చెంపపెట్టు లాంటిదని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణపై ప్రతిపక్షాలు కల్పిస్తున్నవి అపోహలేనని కేంద్రం ఆధీనంలోని ఆర్ఈసీ ఇచ్చిన సర్టిఫికెట్ రుజువు చేసిందని వివరించారు. అదీగాక ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకొంటున్న రుణాలను తెలంగాణ చెల్లించగలదా? అన్న అనుమానాలను సైతం పటాపంచలు చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏ-క్యాటగిరీలో చేర్చడం రాష్ర్టానికి గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ పరపతి జాతీయస్థాయిలో మరింత పెరిగిందని తెలిపారు. ప్రాజెక్టును రికార్డ్ సమయంలో పూర్తికావడంతో పాటు లక్షల మందికి భరోసా ఇస్తున్నదని అన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.