భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న హాకీ జూనియర్ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారం ఇక్కడ జరుగనున్న క్వార్టర్స్లో బెల్జియంతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో ఆడిన తొలి మ్యాచ్లో ఓటమి పాలైన టీమ్ఇండియా.. ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలతో అదరగొట్టి పూల్-‘బి’లో రెండో స్థానంతో క్వార్టర్ ఫైనల్కు చేరింది. తొలి పోరులో ఫ్రాన్స్ చేతిలో ఒక గోల్ తేడాతో ఓడిన భారత్.. ఆ తర్వాత కెనడాపై డజను గోల్స్ తేడాతో, పోలాండ్పై ఆరు గోల్స్ తేడాతో గెలిచింది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సంజయ్ కుమార్, ఉత్తమ్ సింగ్, అరైజీత్ సింగ్, సుదీప్, మణిందర్, శారదానంద, అభిషేక్ సమిష్టిగా రాణిస్తే భారత్ విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు. గత ప్రపంచకప్లో బెల్జియంపై విజయంతోనే టైటిల్ ముద్దాడిన భారత్.. ఈసారి క్వార్టర్స్లోనే ఆ దేశాన్ని ఇంటిదారి పట్టియాలని చూస్తుంటే.. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని బెల్జియం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తున్నది.