జోగులాంబ గద్వాల : పేద ప్రజలకు అండగా గులాబీ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy ) తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలం గొర్లఖాన్దొడ్డి, చమన్ ఖాన్ దొడ్డి, ధరూర్ మండలం చిన్న పాడు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అమలు కాని హామీలతో అధికారంలోకి రావాలని చూస్తుందని, వారి పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.