హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్-2022 పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్ను, మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్ను నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏటా రెండుసార్లు మాత్రమే నిర్వహించే ఈ పరీక్షలను గతేడాది నాలుగుసార్లు నిర్వహించారు. ప్రస్తుతం కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు కొనసాగుతున్నందున ఈ ఏడాది రెండుసార్లు జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
తొలి సెషన్ దరఖాస్తుల స్వీకరణ షురూ
జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ దరఖాస్తులను మంగళవారం నుంచే స్వీకరిస్తున్నారు. విద్యార్థులు ఈ నెల 31 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 31 రాత్రి 11.30 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ తెలిపారు. ఒక్కో సెషన్కు ఒక్క దరఖాస్తును మాత్రమే సమర్పించాలని, ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేస్తే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం jeemain.nta.nic.in వెబ్సైట్, jeemain@nta.ac.in ఈ-మెయిల్ లేదా 011-40759000, 011-69227700 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
జూలై 3న అడ్వాన్స్డ్
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ఎన్టీఏ గతంలోనే వెల్లడించింది. జూలై 3న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. తాజాగా జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల కావడంతో సందిగ్ధతకు తెరపడింది. మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలపై స్పష్టత రావడంతో విద్యార్థులు ప్రిపరేషన్పై దృష్టి పెట్టనున్నారు.
మారనున్న ఇంటర్ పరీక్షల షెడ్యూల్
జేఈఈ మెయిన్ పరీక్షల ప్రభావం ఇంటర్ వార్షిక పరీక్షలపై పడనున్నది. ఈ రెండు పరీక్షలు ఏప్రిల్లోనే మొదలుకానుండటమే ఇందుకు కారణం. జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనుండగా.. ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారే అవకాశమున్నది. దీనిపై ఇంటర్ బోర్డు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పరీక్షల షెడ్యూల్ను మార్చే అంశంపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
మొదటి సెషన్ పరీక్ష తేదీలు
ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21.
రెండో సెషన్ పరీక్ష తేదీలు
మే 24, 25, 26, 27, 28, 29.
పరీక్షల సమయం
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటలు