ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. లాంగ్ టర్మ్లో భారత జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉన్న వారిలో బుమ్రా పేరు కూడా ఉంది. ఇలా కెప్టెన్సీ రేసులో ఉన్న ఈ పేస్గన్.. వికెట్లు తీయలేడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? బుమ్రా రికార్డులు తీసి మన ముందు పడేస్తారు. కానీ బుమ్రా విషయంలో అదే మాట చక్కర్లు కొట్టేదంటే నమ్మశక్యం కాదు. కానీ అదే నిజం అంటున్నాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.
అతను గుజరాత్ రంజీ జట్టుకు సారధిగా ఉన్నప్పుడే రంజీల్లో బుమ్రా అరంగేట్రం చేశాడు. తన హయాంలో అరంగేట్రం చేసిన బుమ్రా అప్పట్లో ఎక్కువ వేరియేషన్లలో బౌలింగ్ చేయలేకపోయేవాడని పార్థివ్ చెప్పాడు. అప్పట్లో కేవలం ఇన్స్వింగర్లు, యార్కర్లపై మాత్రమే బుమ్రా ఫోకస్ పెట్టేవాడని తెలిపాడు. ‘‘ఇప్పుడంటే బుమ్రా బౌలింగ్ యాక్షన్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. కానీ అతను అప్పట్లోనే గుజరాత్లో హాట్ టాపిక్గా మారాడు’’ అని పార్థివ్ గుర్తుచేసుకున్నాడు.
అప్పట్లో బుమ్రా బౌలింగ్లో వేరియేషన్లు లేకపోవడంతో వికెట్లు పడేవి కావని, అద్భుతమైన వేగంతో బ్యాటర్లపై పైచేయి సాధించేవాడు కానీ వికెట్లు తీయలేకపోయేవాడని అందరూ అనేవాళ్లని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పాడు. కానీ రంజీల్లో ఆడే వరకూ ఏ విషయాన్నీ అంత సీరియస్గా తీసుకోలేం కదా అన్నాడు.
‘‘ఆ తర్వాత బుమ్రా చాలా వేగంగా అభివృద్ధి చెందాడు. ముంబై ఇండియన్స్ దళంలో శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ వంటి వారితో కలిసి పని చేసి మరింత రాటుదేలాడు. క్రీజులు తనకు అనుగుణంగా వాడుకోవడం నేర్చుకున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్లో అవుట్ స్వింగర్లు వేయడం చాలా కష్టం. కానీ మలింగతో కలిసి దానిపై పనిచేసి చాలా మెరుగయ్యాడు. కొత్త బంతితో యార్కర్లు వేయడాన్ని తన ఆయుధంలా మార్చుకున్నాడు’’ అని మెచ్చుకున్నాడు. గురువారం నుంచి మొదలయ్యే లంక సిరీస్లో భారతజట్టుకు బుమ్రా వైస్ కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే.