న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలతో ముచ్చటిస్తూ కాంగ్రెస్ అంటే తప్పుడు హామీలు ఇచ్చే పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.
ప్రధాని మోదీ నైరాశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. అమత్ షా, యోగి తర్వాత ఇప్పుడు మోదీ సైతం నైరాశ్యంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మే 10న కర్నాటక ప్రజలు బీజేపీ నేతృత్వంలోని 40 పర్సెంట్ కమిషన్ సర్కార్ను సాగనంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆపై రాజస్ధాన్, చత్తీస్ఘడ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో కర్నాటకలో తమ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే ప్రజలకు తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే అవినీతికి హామీ అని, తప్పుడు వాగ్ధానాలకు హామీ..కర్నాటకలో కాంగ్రెస్ ఏ గ్యారంటీ ఇచ్చే పరిస్ధితిలో లేదని, ఆ పార్టీ వారంటీ కూడా ముగిసిందని విమర్శలు గుప్పించారు. కాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More