Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ దేశంలోని పలు ప్రధాన ఎయిర్పోర్ట్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సోమవారం ఉదయం రాజస్థాన్లోని జైపూర్ (Jaipur), మహారాష్ట్రలోని నాగ్పూర్ (Nagpur) , గోవా విమానాశ్రయాలకు (Goa airports) ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే ఆయా విమానాశ్రయాల అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమెయిల్ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.
కాగా, దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, పలు విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read..
Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన
Kenya | కెన్యాలో ఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 42 మంది మృతి
Gunfire | ఫ్లోరిడా పార్టీలో కాల్పుల కలకలం.. 10 మందికి గాయాలు