సూర్యాపేట, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలపాటు వ్యవసాయాన్ని నట్టేట ముంచిన క్షుద్ర రాజకీయ శక్తుల ఉచ్చులో రైతులు పడొద్దని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి కోరారు. ఏండ్ల తరబడి రైతుల నడ్డి విరిచిన వారే ఇప్పుడు ఏదో ఒరగబెడుతామంటూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎరువులు, విత్తనాలు, అప్పుల కోసం క్యూలో పడిగాపులు కాసిన రైతులు ఇప్పుడు సమృద్ధిగా పంటలు పండించి, వాటిని అమ్ముకోవడానికి క్యూ కడుతున్నారని వివరించారు. నాలుగేండ్లుగా ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని, ఈసారి కూడా ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు మంచి ధరకు ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. గతేడాది కూడా పనీపాటలేని కొన్ని ప్రతిపక్షాలు టోకెన్లపై రాద్ధాంతం చేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నారని, ప్రతిపక్షాల మాయమాటల నమ్మొద్దని చెప్పారు. రైతులంతా ఒకేసారి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తే దళారీల బారిన పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. తమది ముమ్మాటికీ రైతు ప్రభుత్వమని, రైతు శ్రేయస్సే కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైందని, ఒక్క సూర్యాపేట జిల్లాలోనే నాలుగేండ్లలో సాగు విస్తీర్ణం 1.60 లక్షల ఎకరాల నుంచి 6 లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు.